దేశం కోసం త్యాగం చేసిన అజ్ఞాత వీరులకు సమర్పణగా సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్
బైక్ ప్రమాదం నుండి కోలుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఐతే ఆ సినిమా కంటే ముందే మ్యూజికల్ షార్ట్ ఫిలిమ్ ని మన ముందుకు తీసుకురానున్నాడు. "సత్య" పేరుతో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిమ్ లో సాయి ధరమ్ తేజ్ పక్కన కలర్స్ స్వాతి కనిపించనుంది. ఈ మేరకు ఈ షార్ట్ ఫిలిమ్ నుండి పోస్టర్ ని రిలీజ్ చేసారు. భారతదేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులు ఎందరో ఉన్నారు. అందులో మనకు కొంతమందే గుర్తున్నారు. గుర్తు తెలియని, పేర్లు తెలియని అజ్ఞాత వీరుల కోసమే ఈ మ్యూజికల్ షార్ట్ ని రూపొందించామని పోస్టర్ లో ప్రకటించారు.
దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న షార్ట్ ఫిలిమ్
ఈ మ్యూజికల్ షార్ట్ గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేసిన సాయి ధరమ్ తేజ్, ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నామని అన్నాడు. సత్య షార్ట్ ఫిలిమ్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతోంది. సాయి ధరమ్ తేజ్ స్నేహితులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా ఉన్నారు. శృతి రంజని సంగీతం అందిస్తోంది. నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలిమ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే ఈ మ్యూజికల్ షార్ట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా వెల్లడి చేయలేదు. ప్రస్తుతానికి పోస్టర్ విడుదల చేసి, వివరాలు మాత్రమే వెల్లడించారు. మరి సాయి ధరమ్ తేజ్ ఎంతో ఇష్టంగా చేసిన షార్ట్ ఫిలిమ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.