MS Dhoni : 'పెద్ది' కోసం భారీ ప్రణాళికలు.. మహేంద్ర సింగ్ ధోని హాజరవుతారా?
ఈ వార్తాకథనం ఏంటి
'పెద్ది' సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్, రెండు పాటలతోనే సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కుస్తీతో పాటు క్రికెట్ ఆడే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ప్రచార కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. తాజా సమాచారం ప్రకారం, ఉత్తర భారతదేశంలో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారట.
వివరాలు
అభిమానుల్లో మరింత ఉత్సాహం..
గతంలో 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రచారాన్ని బీహార్లోని పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో జార్ఖండ్లోని రాంచీలో 'పెద్ది' కోసం ప్రత్యేక వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్, ధోని పలుమార్లు కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మంచి పరిచయం కూడా ఉంది. దీంతో 'పెద్ది' కార్యక్రమానికి ధోని వస్తారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
వివరాలు
క్రికెట్ ఆటగాడిగా రామ్ చరణ్..
ధోని నిజంగానే ఈ వేడుకకు హాజరైతే ఉత్తర భారతదేశంలో సినిమాకు మరింత ఆదరణ పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే అభిమానులకు కూడా అది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ క్రీడాకారుడిగా కనిపించనున్న నేపథ్యంలో ధోని హాజరు అయితే సినిమాకు మరింత ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతో చిత్రబృందం ఈ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.