Raghavendra Rao: 'ఆమెలాంటి చావు ఎవరికి రాకూడదు'.. శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు భావోద్వేగం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి 'శతాధిక దర్శకుడు'గా ఖ్యాతి పొందిన కె. రాఘవేంద్రరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని మధుర స్మృతులతో పాటు హృదయాన్ని కదిలించే ఓ బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత నటి శ్రీదేవి గురించి చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేశాయి. 'ఆమె లాంటి మరణం మరెవరికీ రావొద్దు' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవితో రాఘవేంద్రరావు కలయికలో దాదాపు 24 సినిమాల అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆమెను వెండితెరపై దేవతలా చూపించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉందని సినీ వర్గాలు చెబుతుంటాయి.
వివరాలు
మన మధ్య నుంచి వెళ్లిపోవడం బాధాకరం
తన చివరి చిత్రం 'మామ్' ఆడియో ఫంక్షన్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ, శ్రీదేవి తన కాళ్లపై పడి నమస్కరించిందని, మళ్లీ కలిసి సినిమా చేయాలని కోరిందని తెలిపారు. అయితే ఆ ఘటన జరిగిన కొద్దికాలానికే ఆమె బాత్టబ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. 'అంతటి గొప్ప నటి, ఇండస్ట్రీకి విశేష సేవలు చేసిన అతిలోక సుందరి అలా మన మధ్య నుంచి వెళ్లిపోవడం బాధాకరం. ఆమెలాంటి మరణం ఎవరూ చూడకూడదంటూ రాఘవేంద్రరావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి శ్రీదేవి అభిమానులు ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.