Ajay Devgn: పాన్మసాలా యాడ్ వివాదం.. అజయ్ దేవ్గణ్ ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ మసాలా ప్రకటనల్లో నటించినందుకు బాలీవుడ్ అగ్ర కథానాయకులు అజయ్ దేవ్గణ్, షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో నిషేధిత ఉత్పత్తిగా ఉన్న పాన్ మసాలాను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్గణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాన్ మసాలా ప్రకటనలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బ్రాండ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా నాడు అజయ్ దేవ్గణ్ ఈ అంశంపై స్పందించారు. ప్రకటనల్లో నటించడం పూర్తిగా తన వ్యక్తిగత ఎంపిక అని ఆయన చెప్పారు.
వివరాలు
హానికరమైతే ఎందుకు నిషేధించరు
ఏదైనా ప్రకటనలో నటించే ముందు అది హానికరమైనదా? కాదా? అనే విషయాన్ని తెలుసుకుంటామని పేర్కొన్నారు.
కొన్ని బ్రాండ్లను ప్రచారం చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వాటి పేర్లను ప్రస్తావించడం లేదని తెలిపారు.
గతంలో తాను కేవలం యాలకులకు సంబంధించిన ప్రకటనలోనే నటించానని అజయ్ దేవ్గణ్ వెల్లడించారు.
ఒకవేళ ఆయా ఉత్పత్తులు నిజంగానే అంత హానికరమైనవైతే.. వాటి అమ్మకాలను పూర్తిగా ఎందుకు నిషేధించరని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాలు
ముగ్గురు హీరోలకు నోటీసులు
షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లకు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో నిషేధంలో ఉన్న పాన్ మసాలా ఉత్పత్తిని ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
గతంలో ఇదే ప్రకటనలో షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్తో పాటు అక్షయ్ కుమార్ కూడా నటించారు.
అయితే ఈ ప్రకటన పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఉందంటూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అక్షయ్ కుమార్ ఆ ప్రకటన నుంచి తప్పుకున్నారు.