Inder Kaur: లుథియానా కాల్వలో పంజాబీ సింగర్ మృతదేహం.. కెనడాకు పరారైన నిందితుడు?
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబీ సింగర్ ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మృతదేహం లుథియానాలోని నీలోన్ కాల్వలో లభ్యమైంది. ఆరు రోజుల క్రితం ఆమెను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమ్రాలా సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇందర్ కౌర్ సోదరుడు జోతీందర్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మే 13 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఆమె తన ఫోర్డ్ ఫిగో కారులో కిరాణా సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.
వివరాలు
భలూర్కు చెందిన సుఖ్విందర్ సింగ్పై అనుమానం
ఈ క్రమంలో భలూర్కు చెందిన సుఖ్విందర్ సింగ్పై అనుమానం వ్యక్తమైంది. అతడు ఇందర్ కౌర్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడని కుటుంబం తెలిపింది. ఇందర్ అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా సుఖ్విందర్ సింగ్ కెనడా నుంచి ప్రత్యేకంగా పంజాబ్కు వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన అనుచరులతో కలిసి ఇందర్ కౌర్ను అడ్డగించి, తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి, హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని నీలో కాల్వలో పడేసి తిరిగి కెనడాకు పారిపోయాడని ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలిపై కూడా కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో సింగర్
మే 15న సుఖ్విందర్ సింగ్, అతని సహచరుడు కరమ్జిత్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జమాల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో బల్బీర్ సింగ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందర్ కౌర్ పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్గా గుర్తింపు పొందింది. 'సోనే ది చిర్హీ', 'జిజా', 'సోహ్నా లగ్దా', 'దేశీ సిర్రే దా' వంటి పాటలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.