Rajinikanth: అభిమానుల ముందుకు రజనీకాంత్ ఆత్మకథ.. పుస్తకంపై కీలక విషయాలు చెప్పిన కుమార్తె సౌందర్య
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్స్టార్ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని త్వరలో ఆత్మకథ రూపంలో అభిమానులు, పాఠకులతో పంచుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన తండ్రి ఆత్మకథ రచనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు.
వివరాలు
ఐదు దశాబ్దాల అనుభవాలన్నీ..
''నాన్నగారు తన ఆత్మకథ రాస్తున్నారు. ఆ పుస్తకం ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో నేను దగ్గరుండి గమనించాను. ఇది భవిష్యత్తులో ఎన్నో ఏళ్లపాటు పాఠకులు మళ్లీ మళ్లీ చదివే పుస్తకంగా నిలుస్తుందని నమ్ముతున్నా. యోగి పరమహంస యోగానంద రాసిన 'ఒక యోగి ఆత్మకథ' తరతరాలకు స్ఫూర్తినిచ్చినట్లే.. మా నాన్నగారి జీవిత కథ కూడా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది'' అని సౌందర్య పేర్కొన్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత పెద్ద నటుల్లో ఒకరిగా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం సాధారణమైనది కాదని ఆమె అన్నారు.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు వంటి అనేక అంశాలు ఈ ఆత్మకథలో చోటు చేసుకోనున్నాయని తెలిపారు.
వివరాలు
తండ్రి జీవితాన్ని సినిమాగా తీస్తే..
రజనీకాంత్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సౌందర్య స్పందించారు.
ఒకవేళ తన తండ్రి జీవిత కథను సినిమాగా రూపొందిస్తే అది వ్యక్తిగతంగానూ,వృత్తిపరంగానూ తనకు అత్యంత ప్రత్యేకమైన అనుభవంగా ఉంటుందని చెప్పారు.
''ఒక దర్శకుడు తన మనసులో ఉన్న ప్రతి ఆలోచనను ఒకే కథలో చేర్చలేడు. కథకు అవసరమైన అంశాలను మాత్రమే ఎంచుకోవాలి. మిగిలిన ఆలోచనలను భవిష్యత్తులో చెప్పబోయే కథల కోసం దాచుకోవాలి. సృజనలో స్పష్టత, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో నాన్నగారు నాకు నేర్పించారు'' అని ఆమె వివరించారు.
రజనీకాంత్ కుమార్తెగా పుట్టడం తనకు గొప్ప వరమని సౌందర్య అన్నారు.
వివరాలు
నెట్ఫ్లిక్స్ కోసం కొత్త వెబ్సిరీస్..
అదే సమయంలో ఆయన కుమార్తె కావడంతో తనపై పోలికలు, అంచనాలు కూడా ఉంటాయని చెప్పారు.
తాను స్వచ్ఛందంగానే సినీ రంగంలోకి అడుగుపెట్టానని, ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సౌందర్య నిర్మాణంలో నెట్ ఫ్లిక్స్ కోసం '#లవ్' అనే తమిళ వెబ్సిరీస్ రూపొందుతోంది.
రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్కు బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ వెబ్సిరీస్ అక్టోబర్లో నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.