Soundarya Jagadish: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన నిర్మాత సౌందర్య జగదీష్
కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. అతడి మృతదేహాన్ని రాజాజీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహాలక్ష్మి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం సౌందర్య జగదీష్ మృతదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. కన్నడ నటుడు దర్శన్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇటీవల, సౌందర్య జగదీష్ తన జెట్ లాగ్ పబ్ అనుమతించదగిన సమయానికి మించి నడుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు.
సౌందర్య జగదీష్ పబ్పై కేసు
పనివేళలకు మించి పార్టీ నిర్వహించినందుకు పబ్పై కేసు నమోదైంది. ఈ పార్టీకి ప్రముఖ నటులు దర్శన్, ధనంజయ్, రాక్లైన్ వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. పోలీసులు విచారణలో దర్శన్ను ప్రశ్నించారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో, సంస్థ విందు ఏర్పాటు చేసిందని, పార్టీని కాదని పేర్కొన్నారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఊరట లభించింది. జగదీష్ 'అప్పు పప్పు', 'స్నేహితారు', 'రామ్లీల', 'మస్త్ మజా మాది' వంటి అనేక చిత్రాలను నిర్మించడంలో ప్రసిద్ది చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ఇష్టపడే నిర్మాతలలో సౌందర్య జగదీష్ ఒకరు. అయన ఆకస్మిక మరణం అయన కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.