
Srikanth: డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్) ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం ఆయనను చెన్నై కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విచారణ సమయంలో శ్రీకాంత్ మాదక ద్రవ్యాల నెట్వర్క్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు పలు ఆధారాలను గుర్తించి వివరాలు సేకరించారు. గత నెలలో చెన్నై నంగంబాక్కంలో ఓ బార్లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి మైలాపూర్ ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేతలు ప్రసాద్, అజయ్ వాండైయార్ తదితరులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి విచారించారు.
Details
రక్తనమూనాలను సేకరించిన పోలీసులు
వారిపై మత్తుపదార్థాల వినియోగం ఆరోపణలు రావడంతో సరఫరా ఎవరినుంచి జరుగుతోందో పోలీసులు ఆరా తీశారు. వారి ద్వారా కొకైన్ సరఫరా కేసులో అరెస్టయిన ప్రదీప్కుమార్ ను కూడా ప్రశ్నించారు. ప్రదీప్ ద్వారా ప్రసాద్ శ్రీకాంత్కు కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. శ్రీకాంత్ కొకైన్ కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించినట్టు కూడా తేలింది. ఈ విషయాలపై నంగంబాక్కం పోలీసులు సోమవారం శ్రీకాంత్ను పోలీస్స్టేషన్కు తరలించి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్ట్ లో ఆయన మత్తుపదార్థాలు వినియోగించినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు శ్రీకాంత్ను అరెస్టు చేశారు.