
Vishal: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. నా హృదయం తరక్కుపోయిందన్న విశాల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన పొలిటికల్ ర్యాలీ సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 28 (శనివారం) రాత్రి తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండటం మరింత విషాదకరం. మృతదేహాలు, బాధిత కుటుంబాల విలాపాలతో ఆస్పత్రులు దుఃఖభరిత వాతావరణంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్తో పాటు పలువురు మంత్రులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Details
టీవీకే పరిహారం చెల్లించాలి
ఈ ఘటనపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. హీరో విశాల్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ - 'టీవీకే విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మృతిచెందారని తెలిసి నా హృదయం తరుక్కుపోతోంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ పరిహారం అందించాలి. ఇదే ప్రస్తుతానికి చేయగలిగే న్యాయం. ఇకపై జరిగే రాజకీయ సభలు, ర్యాలీల్లోనైనా భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే సూపర్స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేస్తూ 'కరూర్లో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి నా హృదయం బరువెక్కింది. ఈ వార్తతో నేను తీవ్ర విషాదంలో మునిగిపోయాను. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను.
Details
అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ కూడా తన ట్వీట్లో స్పందించారు. 'కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న విషయం నన్ను లోతుగా బాధించింది. గాయపడిన వారికి సరైన, మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సహా ఇతర సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.