విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష టీజర్ ఈరోజు సాయంత్రం 5గంటలకు విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రకటించింది. నిజానికి విరూపాక్ష టిజర్, నిన్న సాయంత్రమే విడుదల కావాల్సింది. కానీ మెగా ఫ్యాన్, భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్ అసొసియేషన్ అధ్యక్షుడు చనిపోవడంతో టీజర్ విడుదలను వాయిదా వేసారు. విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన, భీమ్లా నాయక్, సార్ సినిమాల ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ ను విడుదల చేసారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్, ప్రేక్షకులకు బాగా నచ్చింది.
దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష
అజ్ఞానం భయానికి మూలమని, ఆ భయం మూఢనమ్మకానికి దారి తీస్తుందని, ఒకవేళ ఆ నమ్మకం నిజమైనపుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనపుడు అసలు నిజాన్ని చూపే మరో నేత్రం అంటూ చాలా సీరియస్ గా ఎన్టీఆర్ వాయిస్, గ్లింప్స్ లో వినిపించింది. గ్లింప్స్ వల్ల ఇదొక సీరియస్ సినిమా అని తెలుస్తూనే ఉంది. అదీగాక ఈ కథకు స్క్రీన్ ప్లేని సుకుమార్ అందించాడు. దాంతో విరూపాక్ష మూవీపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. కార్తీక దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా రూపుదిద్దుకుంటున్న విరూపాక్ష, ఏప్రిల్ 21న విడుదలవుతుంది.