విరూపాక్ష సినిమా ప్రమోషన్లు షురూ, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విరూపాక్ష, ఏప్రిల్ 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మొదలుపెట్టింది చిత్రబృందం. విరూపాక్ష కథలోని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఒక వీడియోను రిలీజ్ చేసారు. ఇందులో విరూపాక్ష కథలో కనిపించే రుద్రవరం అనే ఊరు గురించీ, ఆ ఊరిలో ఉండే మోదమాంబ గుడి గురించి చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల మాట్లాడుతూ, రుద్రవరం గ్రామానికి ఒక క్యారెక్టర్ ఉంటుందనీ, ఆ గ్రామంలో మోదమాంబ అనే గుడి ఉంటుందనీ, ఆ గుడి తాలూకు సెట్ ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డామని తెలియజేసారు నాగేంద్ర.
గుడి చుట్టూ తిరిగే విరూపాక్ష కథ
మోదమాంబ గుడి చాలా పురాతన కాలం నాటిదనీ, గుడి స్తంభాలు, వాటి మీద డిజైన్లు చేయడానికి చాలా రీసెర్చ్ చేసామనీ, బంకమన్నుతో డిజైన్ చేయగలిగే అనుభవం ఉన్న వారిని తీసుకొచ్చి వర్క్ చేయించామని అన్నాడు. మొత్తానికి ఈ వీడియో ద్వారా మోదమాంబ గుడి అనే కొత్త విషయం బయటకు తెలిసింది. దీనే కథా ప్రపంచంగా పరిచయం చేసారు కాబట్టి, ఈ గుడి చుట్టూనే కథ తిరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్.. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కార్తీక దండు దర్శకత్వం వహిస్తున్నారు.