Trivikram: సూర్యలాంటి హీరోలు చాలా అరుదు: త్రివిక్రమ్
ఈ వార్తాకథనం ఏంటి
కుటుంబ కథలకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతటి ఆదరణ ఉందో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మరోసారి నిరూపించిందని హీరో సూర్య అన్నారు. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన.. కుటుంబ నేపథ్యంలో సాగే కథల ప్రాధాన్యాన్ని చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ మరోసారి గుర్తుచేసిందని పేర్కొన్నారు. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించగా.. రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి హైదరాబాద్లో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివరాలు
సూర్యతో సినిమా చేయాలని ఉంది: త్రివిక్రమ్
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథ తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇలాంటి కథను ఎంతో శ్రమించి తెరకెక్కించి విజయాన్ని అందుకున్న చిత్రబృందాన్ని అభినందించారు.
సూర్యతో కలిసి సినిమా చేయాలనే కోరిక తనకూ ఉందని త్రివిక్రమ్ వెల్లడించారు.
అయితే ఇప్పటివరకు సూర్యకు నచ్చే కథను చెప్పలేకపోయానని సరదాగా వ్యాఖ్యానించారు.
త్వరలోనే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సూర్యతో తాను సినిమా చేయాలని తన భార్య కూడా కోరుకుంటున్నారని త్రివిక్రమ్ తెలిపారు.
ఆమె సూర్యకు పెద్ద అభిమానినని చెప్పారు. మహిళలు ఎవరినైనా అంత సులభంగా అభిమానించరని, ఒకసారి నచ్చితే మాత్రం జీవితాంతం ఆ అభిమానాన్ని కొనసాగిస్తారని అన్నారు.
వివరాలు
భాషల హద్దులు ఇక లేవు
సూర్య, కార్తీ ఇద్దరూ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సొంత హీరోలుగా మారిపోయారని త్రివిక్రమ్ అన్నారు.
తెలుగు, తమిళం, హిందీ అనే భాషాపరమైన విభజనలకు ప్రస్తుతం అంతగా ప్రాధాన్యం లేదని చెప్పారు. ప్రాంతీయ హద్దులు కూడా క్రమంగా చెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.
ఇకపై ఇలాంటి చిన్న చిన్న భేదాల గురించి మాట్లాడకుండా.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సామర్థ్యాన్ని చాటిచెప్పే దిశగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అదే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఆ ప్రయాణంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా మరో ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందని పేర్కొంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.