Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు 2021లో జరగ్గా.. అందులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య జరిగిన రచ్చ సినీ జనాలతో పాటు ప్రేక్షకులు మరిచిపోలేదు. అయితే 'మా' ఎన్నికల సమయంలో అసోసియేషన్కు సొంత బిల్డింగ్ కట్టి ఇస్తానని, పలు హామీలను విష్ణు ఇచ్చారు. పదివీకాలం పూర్తికావొస్తున్నా.. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఇచ్చిన అసోసియేషన్కు సొంత బిల్డింగ్ హామీపై ప్రకాష్ రాజ్ మాట్లాడారు. నాడు ఇచ్చిన హామీలను విష్ణు నెరవేర్చాడా? అని జర్నలిస్టు అడగ్గా.. అది ఓట్లేసిన వాళ్లను అడగాలని ప్రకాశ్ రాజ్ బదులిచ్చారు.
'మా' ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారు: ప్రకాశ్ రాజ్
మరికొన్ని కామెంట్స్ కూడా ప్రకాశ్ రాజ్ చేశారు. 'మా' ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే కొందరు స్పెషల్ ఫ్లైట్స్ వేసి రప్పించారని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఎన్నికల హామీలపై దొంగ ఓట్లు వేసిన వాళ్ళు అడగరని, అలాగే బయటి నుంచి వచ్చి ఓట్లేసిన వాళ్లు కూడా ఎలాగూ అడగరని ప్రకాశ్ చెప్పుకొచ్చారు. కొందరు పెద్దవాళ్లు ఆయనకు మద్దతు తెలిపారని, వాళ్లకు మనస్సాక్షి ఉంటే, వాళ్లైనా అడగాలన్నారు. తాను ఆ ఎన్నికల్లో ఓడిపోయానని, అయితే మళ్లీ మా ఎన్నికల్లో పోటీ చేసే టైమ్ తనకు లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికలైన రెండేళ్ల తర్వాత ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాశంగా మారాయి.