Sai Pallavi : రూ.2 కోట్ల ఆఫర్ను ఎందుకు తిరస్కరించింది? సాయిపల్లవి చెప్పిన అసలు కారణం హృదయాన్ని తాకుతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
సహజమైన నటన, మేకప్కు దూరంగా ఉండే వ్యక్తిత్వం, విలువలకు కట్టుబడి ఉండే నైజంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1'లో సీత పాత్రలో నటిస్తున్నారు. అయితే, గతంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటన కోసం వచ్చిన రూ.2 కోట్ల భారీ ఆఫర్ను సాయిపల్లవి తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఆమె గతంలో వెల్లడించిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వివరాలు
మేకప్ కంటే సహజత్వానికే ప్రాధాన్యం
తన ముఖానికి ఎక్కువ మేకప్ సరిపోదని, అందుకే సాధ్యమైనంత వరకు సహజంగానే కనిపించేందుకు ప్రయత్నిస్తానని సాయిపల్లవి ఎప్పుడూ చెబుతుంటారు.
సినిమాల్లో కూడా ముఖంపై ఉన్న మొటిమలను దాచకుండా నటించడం ఆమె ప్రత్యేకతగా నిలిచింది. "నేను ఎలాంటి బ్యూటీ క్రీమ్ లేదా ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించను.
మీ చర్మ రంగు ఎలా ఉన్నా, మీపై మీకు నమ్మకం ఉండటమే అసలైన అందమని ఆమె స్పష్టంగా చెప్పారు.
అయితే రూ.2 కోట్ల ప్రకటనను తిరస్కరించడానికి ఇదొక్కటే కారణం కాదని, తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన కూడా తన నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని వెల్లడించారు.
వివరాలు
చెల్లి అనుభవించిన బాధే కారణం
సమాజం సృష్టించిన అందాల ప్రమాణాల వల్ల నల్లగా లేదా గోధుమరంగులో ఉన్నవారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తాను చాలా దగ్గరగా చూశానని సాయిపల్లవి తెలిపారు. మా ఇంట్లోనే నా చెల్లి ఈ సమస్యను ఎదుర్కొంది. నేను తనకంటే కొంచెం తెల్లగా ఉండేదాన్ని. అందుకే తాను కూడా తెల్లగా మారాలని అనుకునేది. 'ఇవి తింటే తెల్లగా అవుతావు' అంటూ మా అమ్మ కూడా ఇష్టం లేకపోయినా కాయగూరలు, పండ్లు తినిపించేది. తనకు ఇష్టం లేని ఆహారం తింటూ ఆమె పడిన బాధ నన్ను ఎంతో కలిచివేసిందని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. ఆ అనుభవం తర్వాత కనీసం తన చెల్లి కోసమైనా చర్మరంగు ఆధారంగా జరిగే వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
వివరాలు
డబ్బు నన్నెప్పుడూ ఆకర్షించలేదు
అంత డబ్బు సంపాదించి నేను ఏం చేసుకోవాలి? కనీసం నా చెల్లి కోసం అయినా ఈ వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలని అనుకున్నానని ఆమె అన్నారు.
తెల్లగా ఉండటమే అందానికి ప్రమాణమనే భావజాలాన్ని ప్రోత్సహించే బ్రాండ్లకు ప్రచారం చేయడం తన వ్యక్తిత్వానికి పూర్తిగా వ్యతిరేకమని సాయిపల్లవి స్పష్టం చేశారు.
నేను ఎప్పుడూ సాధారణ జీవితాన్నే ఇష్టపడతాను. డబ్బు నన్నెప్పుడూ ఆకర్షించలేదని పేర్కొన్నారు.
వివరాలు
మొటిమల వల్ల పడిన మానసిక వేదన
2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో సినీ రంగ ప్రవేశం చేయడానికి ముందు తన ముఖంపై ఉన్న మొటిమల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని సాయిపల్లవి వెల్లడించారు.
మొటిమలు పోవాలని వందలాది క్రీములు వాడాను. నన్ను నేను చాలా బాధపెట్టుకున్నాను. బయటకు వెళ్లినా జనాలు నా కళ్లలోకి చూడకుండా ముఖంపై ఉన్న మొటిమలనే గమనిస్తున్నారనిపించేది.
ఆ కారణంగా బయటకు రావడానికే భయపడేదాన్ని అని ఆమె చెప్పారు.
వివరాలు
'ప్రేమమ్'తో మారిన జీవితం
అయితే 'ప్రేమమ్' విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సాయిపల్లవి తెలిపారు. నా ముఖంపై మొటిమలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు.
నన్ను ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించారు. నాలాంటి సాధారణ అమ్మాయిని అభిమానించడం చూసి చిన్నపిల్లలు, టీనేజర్లు కూడా ఎంతో స్ఫూర్తి పొందారు.
'మొటిమలు ఉన్నా ఆమెను అందరూ ఇష్టపడుతున్నారు' అనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.
వివరాలు
అభిమానులను మోసం చేయలేను
తనను ఎలా ఉన్నానో అలా అంగీకరించిన అభిమానులను మోసం చేయడం తన వల్ల కాదని సాయిపల్లవి స్పష్టం చేశారు.
చర్మరంగుపై ప్రజల్లో ఆత్మన్యూనతా భావాన్ని పెంచే ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించడం తనకు ఇష్టం లేదన్నారు.
అదే కారణంతో రూ.2 కోట్ల భారీ ఆఫర్ను కూడా తిరస్కరించినట్లు 'రామాయణ: పార్ట్ 1' నటి మరోసారి స్పష్టం చేశారు.