Venu Yellamma: గ్రామీణ నేపథ్యంతో 'ఎల్లమ్మ' మూవీ.. సంక్రాంతికి గ్లింప్స్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
'బలగం' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై, స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను వేణు తాజాగా పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ సినిమాకు 'ఎల్లమ్మ' అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
Details
సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే
తెలంగాణ మట్టి వాసన, గ్రామీణ సంస్కృతిని 'బలగం'లో హృద్యంగా చూపించిన వేణు, ఈసారి కూడా గ్రామీణ నేపథ్యంతో కూడిన మరో విభిన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నటించనున్నారని సమాచారం. ఇది ఆయనకు నటుడిగా వెండితెరపై మొదటి చిత్రం కావడం విశేషం. ఇక కథానాయికగా కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పాల్గొనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.