CAG Report: ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు,మరుగుదొడ్లు లేవు.. కాగ్ నివేదిక సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పనలో గత ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నివేదిక స్పష్టం చేసింది.
ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో కనీసం ఐసీయూలే లేకపోవడం గమనార్హమని తెలిపింది.
అంతేకాకుండా, ఆప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్లు కూడా శోచనీయ స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
కనీసం వీటిలో మరుగుదొడ్లు కూడా లేవని వెల్లడించింది.
వివరాలు
ఢిల్లీ ఆరోగ్య రంగంలో భారీ అవినీతి
గత ఆరేళ్లుగా ఢిల్లీ ఆరోగ్య రంగంలో భారీ అవినీతి జరుగుతున్నట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది.
ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ నివేదికలో వైద్య పరికరాల కొరత, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో తీవ్ర లోపం, మొహల్లా క్లినిక్లలో అవసరమైన మౌలిక వసతుల లేకపోవడం, అత్యవసర నిధుల వినియోగం తక్కువగా ఉండడం వంటి అంశాలపై వివరాలు ఉన్నాయి.
ముఖ్యంగా, ఢిల్లీలో అనేక ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేవని నివేదిక స్పష్టం చేసింది.
ఢిల్లీ నగరంలో 27 ఆస్పత్రులుండగా,అందులో 14 ఆస్పత్రుల్లో ఐసీయూ విభాగమే లేదని కాగ్ నివేదికలో వెల్లడైంది.
అలాగే, 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంక్లు లేవని,8 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం కూడా అందుబాటులో లేదని తెలిపింది.
వివరాలు
అంబులెన్సు సదుపాయం కూడా లేదు
మరో 15 ఆస్పత్రుల్లో మార్చురీ సదుపాయాలు లేవని, 12 ఆస్పత్రులకు అంబులెన్సు సదుపాయం కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంది.
ఇక ఆప్ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసిన మొహల్లా క్లినిక్ల స్థితిగతులు కూడా ఆశించిన స్థాయిలో లేవని నివేదిక వెల్లడించింది.
2023 నాటికి 1,000 మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, కేవలం సగమే పూర్తి చేయగలిగిందని నివేదిక పేర్కొంది.
అయితే, అందులోనూ సరైన మౌలిక వసతులు లేవని వెల్లడించింది.
ఈ క్లినిక్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల్లో అవసరమైన ఔషధాలు అందుబాటులో లేవని పేర్కొంది.
ఇవి మాత్రమే కాకుండా, ఢిల్లీ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రమైన స్థాయిలో ఉందని నివేదిక తెలియజేస్తోంది.
వివరాలు
నిరుపయోగంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలు, ప్రైవేట్ గదులు
కొన్ని ఆస్పత్రుల్లో 21% నర్సుల కొరత ఉండగా, 38% పారామెడికల్ సిబ్బంది, 50% నుంచి 96% వరకు వైద్య సిబ్బంది లేమి ఉందని వివరించింది.
రాజీవ్ గాంధీ,జనక్పురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలు, ప్రైవేట్ గదులు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
అలాగే, ట్రామా సెంటర్లలో అత్యవసర సంరక్షణ కోసం నిపుణులైన వైద్యులు లేరు.
కరోనా చికిత్స కోసం కేటాయించిన ₹787.91 కోట్లలో కేవలం ₹582.84 కోట్లు మాత్రమే వినియోగించారని నివేదిక వెల్లడించింది.
ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కేటాయించిన ₹3.52 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయని, అత్యవసర ఔషధాలు, పీపీఈ కిట్ల కోసం కేటాయించిన ₹83.14 కోట్లు పూర్తిగా వినియోగించబడలేదని నివేదిక పేర్కొంది.