TTD: తితిదేకు అనంత్ అంబానీ విరాళం.. తిరుపతికి చేరిన 15 ఎలక్ట్రిక్ బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
తితిదేకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 ఇప్పటికే తిరుపతికి చేరుకున్నాయి. వీటిలో ఒక బస్సును ఆదివారం ట్రయల్రన్లో భాగంగా తిరుమలకు తీసుకువచ్చారు. తిరుమల స్థానిక రింగురోడ్డులో ఉన్న తితిదే ఎలక్ట్రిక్ బస్స్టేషన్లో బస్సుకు ఛార్జింగ్ నిర్వహించారు. ట్రయల్రన్లో భాగంగా తిరుమలకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బస్సు పనితీరును తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి పరిశీలించనున్నారు. బస్సు నిర్వహణ, పనితీరు తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.
వివరాలు
రూ.27.5 కోట్ల విలువైన బస్సుల విరాళం
ఈ ఏడాది జూన్లో అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తితిదేకు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు.
వీటితోపాటు బస్సుల నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లను, ఛార్జింగ్ స్టేషన్ను కూడా రిలయన్స్ సంస్థ సమకూర్చనున్నట్లు వెల్లడించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.