Hyderabad: హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు? ఓటర్ల జాబితాలో భారీ కోత!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) కార్యక్రమం సోమవారంతో ముగియనుండగా.. శనివారం సాయంత్రం వరకు నమోదైన వివరాల ప్రకారం రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవులు ఉన్నప్పటికీ బూత్ స్థాయి అధికారి (BLO) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లోనే ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేయని ఓటర్లు ఎవరైనా ఉంటే.. వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు.
వివరాలు
సనత్నగర్లో దాదాపు సగం ఓట్లు రద్దు
మరోవైపు ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,54,030 ఓట్లు ఉన్నాయి.
వీటిలో ఏకంగా 1.16 లక్షల ఓట్లు.. అంటే 45.68 శాతం ఓట్లు రద్దయ్యే అవకాశం ఉందని అంచనా. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిని పరిగణనలోకి తీసుకుంటే చేవెళ్ల, కల్వకుర్తి, షాద్నగర్ నియోజకవర్గాల్లో రద్దయ్యే ఓట్లను మినహాయించాల్సి ఉంటుంది.
మిగిలిన 25 నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నంలో అత్యల్పంగా 21.43 శాతం, బహదూర్పురలో 22.38 శాతం ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది.
రాబోయే రెండు రోజుల్లో ఈ సంఖ్యలో ఒక శాతం మేర మాత్రమే పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
నియోజకవర్గాల వారీగా రద్దయ్యే ఓట్ల శాతం
బోనాల పండుగ నేపథ్యంలో ఓట్ల సంఖ్యలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చని చెబుతున్నారు.
హైదరాబాద్ జిల్లా
ముషీరాబాద్ 39.77 శాతం, మలక్పేట్ 33.92 శాతం, అంబర్పేట్ 36.17 శాతం, ఖైరతాబాద్ 36.78 శాతం, జూబ్లీహిల్స్ 44.21 శాతం, సనత్నగర్ 45.68 శాతం, నాంపల్లి 31.33 శాతం
కార్వాన్ 33.23 శాతం, గోషామహల్ 39.38 శాతం, చార్మినార్ 32.49 శాతం, చాంద్రాయణగుట్ట 32.57 శాతం, యాఖుత్పుర 31.40 శాతం, బహదూర్పుర 22.38 శాతం, సికింద్రాబాద్ 38.47 శాతం, కంటోన్మెంట్ 35.31 శాతం ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది.
వివరాలు
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం 21.43 శాతం, ఎల్బీనగర్ 42.19 శాతం, మహేశ్వరం 40.03 శాతం, రాజేంద్రనగర్ 38.14 శాతం, శేరిలింగంపల్లి 36.60 శాతం, చేవెళ్ల 19.31 శాతం, కల్వకుర్తి 11.65 శాతం, షాద్నగర్ 14.56 శాతం ఓట్లు రద్దు కానున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
మేడ్చల్ 29.30 శాతం, మల్కాజిగిరి 37.30 శాతం, కుత్బుల్లాపూర్ 35.99 శాతం, కూకట్పల్లి 32.81 శాతం, ఉప్పల్ 40.05 శాతం ఓట్లు రద్దయ్యే అవకాశం ఉందని అంచనా.
వివరాలు
రాజధానిపై ఎందుకు ప్రభావం?
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది నగరానికి వలస వస్తుంటారు. కొంతకాలం తర్వాత వారిలో చాలామంది నగరంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నగరంలోనూ ఓటరు గుర్తింపు పొందుతున్నారు.
అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఓటరు సర్వే జరుగుతున్న నేపథ్యంలో.. ఒకేసారి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిలో చాలామంది నగరంలోని ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులకు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.
సొంతూరిలోనే తమ ఓటు హక్కును కొనసాగించేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.
వివరాలు
ఎన్యుమరేషన్ ఫారాలను పక్కన పెట్టిన అధికారులు
దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు నియోజకవర్గాల్లోనూ లక్షలాది మంది ఎన్యుమరేషన్ ఫారాలను పక్కన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమైందని తెలుస్తోంది.
తమకు ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారం అందలేదని చెబుతున్న ఓటర్లు కూడా లక్ష మందికి పైగా ఉన్నారు.
ఇలాంటి వారంతా ఆన్లైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.