Andhra Pradesh: గ్రామాల్లో 5,460 సామాజిక సోక్ పిట్ల నిర్మాణానికి రూ.54.60 కోట్లకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.54.60 కోట్ల వ్యయంతో తొలి విడతలో 5,460 సామాజిక సోక్ పిట్ల నిర్మాణానికి సోమవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో సోక్ పిట్ నిర్మాణానికి రూ.1 లక్ష వ్యయంగా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 70 శాతం, అంటే రూ.38.22 కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద విడుదల కానుండగా, మిగిలిన 30 శాతం అంటే రూ.16.38 కోట్లను ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీ నిధుల ద్వారా సమకూర్చనున్నారు.
వివరాలు
8 వేల సామాజిక సోక్ పిట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
గ్రామాల్లో పర్యావరణ పరిశుభ్రతను మెరుగుపరచడం, వాడుక నీటి నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టడం, అలాగే బహిరంగ మల విసర్జన రహిత (ODF) హోదాను రాష్ట్రం కొనసాగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం 8 వేల సామాజిక సోక్ పిట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
ఈ నిర్మాణాలకు అనువైన ప్రదేశాలను అధికారులు ముందుగానే గుర్తించారు.
ఆ ప్రణాళికలో భాగంగా తొలి దశలో 5,460 సామాజిక సోక్ పిట్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.