Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సహాయక చర్యల బృందం (Rescue team) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. రేవా జిల్లా అదనపు ఎస్పీ అనిల్ సోంకర్ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వ్యవసాయ భూమిలో ఉన్న బోరుబావి వద్ద ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ అందులోకి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్క్యూటీమ్ కు సమాచారం అందిన కొద్దిసేపట్లోనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించిందని తెలిపారు. బోరుబావిలో ఆరు సెంటీమీటర్ల లోతులోనే బాలుడు ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు.
సురక్షితంగా బయటకు తీసుకొస్తాం: అదనపు ఎస్పీ
బాలుడిని వీలైనంత త్వరగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం రెండు ప్రొక్లెయినర్లతో బోరుబావికి రెండువైపులా సమాంతరంగా తవ్వుతున్నట్లు వివరించారు. మరికొద్దిసేపట్లో మరో రెస్క్యూటీమ్ అక్కడకు చేరుకోనుందని ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ఎస్పీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కాగా, బాలుడు క్షేమంగా ఉండాలని, క్షేమంగా అతడు బయటకు రావాలని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు కోరుకుంటున్నారు. బోరుబావిలో పడిన బాలుడి పేరు మయూర్ గా పోలీసులు గుర్తించారు.