Mumbai:థానే కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. MIDC ఫేజ్ 2లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ భారీ పేలుడులో నలుగురు మంది మృతి చెందగా,25 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.అంబులెన్సులతో పాటు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలంలో ఉన్నాయి. డోంబివాలిలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఐడిసి)ఏరియాలోని ఫేజ్-2లో ఉన్న'అంబర్ కెమికల్ కంపెనీ'బాయిలర్లో పేలుడు సంభవించిందని డాక్టర్ నిఖిల్ పాటిల్ తెలిపారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీ లోపల డే షిఫ్ట్ కార్మికులు ఉన్నారు.లోపల ఎంతమంది చిక్కుకుపోయారో తెలియరాలేదు.
సర్వీస్ సెంటర్లో కూడా మంటలు చెలరేగాయి
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం మూడు-నాలుగు కిలోమీటర్ల వరకు వినిపించింది. ఆ తర్వాత ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. కర్మాగారానికి సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగడంతో 12కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదంలో 25మందికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.