Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు!
ఈ వార్తాకథనం ఏంటి
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్లు (జెడ్పీలు), మండల ప్రజా పరిషత్లు (ఎంపీపీలు) త్వరలో ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రస్తుత జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది.
వివరాలు
సెప్టెంబర్ 23తో ముగింపు
దీంతో సెప్టెంబర్ 25 నుంచి జెడ్పీల పరిపాలన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కొనసాగనుంది.
జెడ్పీలకు సంబంధిత జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.
ఈ పాలన ఆరు నెలల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే కొత్తగా ఎన్నికైన జెడ్పీ పాలకవర్గాలు బాధ్యతలు చేపడితే.. ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది.
జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ను జెడ్పీకి ప్రత్యేక అధికారిగా నియమించే అధికారం పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల్లోనూ ఉంది.
ఇక మండల ప్రజా పరిషత్ల విషయానికి వస్తే.. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియనుంది.
సెప్టెంబర్ 24 నుంచి మండల పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి.
వివరాలు
ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం
మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్డీవోలు తదితర అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది.
మండల పరిషత్లకు ప్రత్యేక అధికారులుగా ఎంపికయ్యే అధికారులు.. సంబంధిత ఎంపీడీవో కంటే కనీసం ఒక ర్యాంకు పైస్థాయిలో ఉన్నవారై ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఎన్నికైన కొత్త మండల పరిషత్ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకు వీరు పరిపాలనను పర్యవేక్షించనున్నారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. కొత్తగా ఎన్నికైన సభ్యులు, అధ్యక్షులు బాధ్యతలు చేపట్టే వరకు ప్రత్యేక అధికారి పరిషత్ అధికారాలు, విధులను నిర్వహించే అవకాశం ఉంది.
వివరాలు
13 జెడ్పీల స్థానంలో 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు
మరోవైపు, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జెడ్పీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
గతంలో ఉన్న 13 జెడ్పీల స్థానంలో 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఈ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కొత్త జెడ్పీ వ్యవస్థ అమల్లోకి రానుంది.
ఇదిలా ఉండగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.
పూర్తి స్థాయి ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించింది. దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.