Page Loader
APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి
విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి

APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో పర్యాటకుల అభిరుచి ప్రకారం 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకులు దృష్టి సారించారు. ఇప్పటికే పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక కసరత్తు పూర్తి అయ్యింది. విశాఖ నుంచి విలాస నౌక (లగ్జరీ యాచ్‌) నడిపేందుకు అనుకూలంగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)తో డాల్ఫిన్‌ ఓషన్‌ క్రూజెస్‌ సంస్థ ఇటీవల అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ నౌకలో అందించబోయే సౌకర్యాలను వారు వివరించారు. విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద పర్యాటకులను విలాస నౌకలో ఎక్కించి సముద్రంలో మూడు, నాలుగు గంటలు విహరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఈ పర్యటన 15 నాటికల్‌ మైళ్ల పరిధిలో ఉండి, అంతర్జాతీయ సరిహద్దు వెలుపల నిర్వహించబడుతుంది. ఇది మొదట అమలు చేయనున్నారు.

వివరాలు 

విశాఖ నుంచి కాకినాడ మీదుగా నెల్లూరు వరకు

ఇక ఈ నౌకను విశాఖ నుంచి కాకినాడ వరకు నడపాలనుకుంటున్నారు. విశాఖ, భీమిలి వద్ద పర్యాటకులను ఎక్కించి కాకినాడ వరకు తీసుకెళ్లి,అక్కడ నుంచి విశాఖకు తిరిగివస్తారు. అదేవిధంగా, విశాఖ నుంచి కాకినాడ మీదుగా నెల్లూరు వరకు పర్యాటకులను తీసుకెళ్లే ప్రణాళిక కూడా ఉంది. అక్కడ ప్రయాణికులకు అవసరమైన జెట్టీల సౌకర్యం అందించడంపై ఆలోచన జరుపుతున్నారు. ఈ పర్యటనలను పర్యాటకుల డిమాండ్‌ను బట్టి నిర్వహించనున్నారు. పర్యాటక నౌకల్లోకి ఎక్కేందుకు,దిగేందుకు చాలాస్థానాలలో హార్బర్లు లేదా జెట్టీలు లేవు. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచారు. అయితే విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు అంతర్జాతీయ క్రూజ్‌ టెర్మినల్‌ కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఈ క్రూజ్‌ పర్యటనలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

వివరాలు 

విలాస నౌక గురించి వివరాలు: 

ఈ నౌక 50మందికి సరిపోయేలా రూపొందిస్తున్నారు. ఇందులో మరుగుదొడ్లతో కూడిన రెండు విలాసవంతమైన ఏసీ పడకగదులు ఉంటాయి.అందులో స్వచ్ఛమైన తాగునీరు కూడా అందుబాటులో ఉంటుంది. మిగిలిన ప్రయాణికులకు మరుగుదొడ్లు,ఆతిథ్య సేవలకు ప్రత్యేక వసతి అందించబడుతుంది. ఈ నౌక చిన్నస్థాయి వేడుకల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. అనుమతుల విషయంలో: క్రూజ్‌లను దేశీయ జలమార్గాల్లో నడిపేటప్పుడు ఆయా రాష్ట్రాల చట్టాలను పాటించాలి. ఎక్సైజ్,తీర ప్రాంత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఓ నౌక విశాఖ నుంచి చెన్నై వెళ్ళే సమయంలో అనుమతుల లేకపోవడం కారణంగా పుదుచ్చేరి వద్ద నౌకను నిలిపేశారు. ఇటీవలి దక్షిణ భారతదేశ పర్యాటక మంత్రుల సదస్సులో ఈ అంశంపై చర్చ జరిగింది,దీంతో ఆ రాష్ట్రం నుంచి కొంత సానుకూలత వ్యక్తమైంది.