Bhogapuram: ప్రగతికి కొత్త ముఖచిత్రం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఘన ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకను తమ ఇంటి పండుగగా భావించిన ప్రజలు అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చారు. జాతీయ జెండాలు చేతబూని, 'భారత్ మాతాకీ జై' నినాదాలతో భోగాపురం మార్మోగింది. ఒకప్పుడు ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్బస్సా? అంటూ విమర్శించిన వారికి సమాధానంగా ఈ కార్యక్రమం నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఉదయం 8 గంటలకే సభా ప్రాంగణంలోని గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. సుమారు రెండు లక్షల మంది సభా ప్రాంగణానికి చేరుకోగా, మరో లక్ష మందికి పైగా ప్రజలు బయట రోడ్లపై, వాహనాల్లోనే ఉండిపోయారు. కొందరు బస్సులపై నిలబడి కార్యక్రమాన్ని వీక్షించారు.
వివరాలు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి పలు హామీలు
విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందన్న ఆశాభావం ప్రజల్లో స్పష్టంగా కనిపించింది.
వేదికపై మాట్లాడిన ప్రతి నాయకుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి హామీ ఇవ్వగా, సభికులు ఘనంగా హర్షధ్వానాలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో ప్రారంభమైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం చరిత్రలో నిలిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఉదయం 10.45 గంటలకు దిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, మంత్రి నారా లోకేశ్, శాసనసభ స్పీకర్ సీహెచ్. అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్, పీవీఎన్ మాధవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వివరాలు
టెర్మినల్ భవనం సందర్శన
ఆ తర్వాత ప్రధాని విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి సందర్శించారు. చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, ఆధునిక సాంకేతికత ప్రత్యేకతలను జీఎంఆర్ ప్రతినిధులు ఆయనకు వివరించారు.
విమానాశ్రయ మాస్టర్ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను పరిశీలించిన ప్రధాని, టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియోవాల్ను కూడా తిలకించారు.
ఆ వీడియోవాల్లో ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించగా, వాటి విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించారు.
విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులను కూడా ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు.
వివరాలు
పొందూరు ఖాదీతో ఘన సన్మానం
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కలిసి ఉత్తరాంధ్రకు ప్రత్యేక గుర్తింపైన పొందూరు ఖాదీ జమ్దానీ అంగవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విమానాశ్రయానికి అంకురార్పణ చేసిన అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను ముందుండి నడిపించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ముగ్గురూ ఉత్తరాంధ్ర మట్టిబిడ్డలేనని పేర్కొనగా సభికులు ఘనంగా స్పందించారు.
వివరాలు
బొబ్బిలి వీణ ప్రధానికి బహుమతి
ప్రధాని మోదీకి అందజేసిన బొబ్బిలి వీణను విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన కళాకారుడు బోనుమద్ది మురళి తయారు చేశారు.
పనస చెక్కతో 25 రోజుల పాటు శ్రమించి రూపొందించిన ఈ వీణను దేశ ప్రధానమంత్రికి బహూకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్లో స్పందిస్తూ.. భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇది ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యానికి ప్రతిరూపం. రాష్ట్ర సంస్కృతిని పరిరక్షిస్తున్నందుకు అభినందనలని పేర్కొన్నారు.
వివరాలు
చంద్రబాబుతో ఆలింగనం.. పవన్తో కరచాలనం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు.
అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగం అనంతరం తన స్థానానికి వెళ్తుండగా పిలిచి కరచాలనం చేసి అభినందించారు.
వేదికపై మాట్లాడిన నాయకులంతా 'భారత్ మాతాకీ జై' నినాదాలు చేయడమే కాకుండా సభికులతోనూ అదే నినాదాలు చేయించారు.
భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టింది.. గుమ్మడికాయ కట్టింది కూటమి ప్రభుత్వమే. భూములిచ్చిన రైతులకు పాదాభివందనలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించగా సభ కరతాళధ్వనులతో మార్మోగింది.
వివరాలు
ప్రధానికి ఘన స్వాగతం
ప్రధాని బహిరంగ సభా వేదికపైకి చేరుకున్న వెంటనే ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ ఘన స్వాగతం పలికారు.
సభ ప్రారంభమైన తర్వాత దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పరస్పరం మాట్లాడుకుంటూ కనిపించారు.
తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడింది ఎవరు? రైల్వే జోన్ ఇచ్చింది ఎవరు? పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు అందించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లింది ఎవరు?" అంటూ ప్రశ్నించి, సభికులతో మోదీ.. మోదీ నినాదాలు చేయించారు.