
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ విచారణ కేసులో ఊహించని ట్విస్ట్.. సంస్థలపైకి దృష్టి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసు తాజాగా కొత్త మలుపు తిరిగింది.
ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.
ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో, బెట్టింగ్ యాప్లను ప్రొమోట్ చేసిన ప్రముఖ సినీ నటులు.. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీతోపాటు 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని సహా 11 మంది మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు నమోదైంది.
వివరాలు
సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్పై వరుస కేసులు
మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో వరుస కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను విచారించారు. తాజాగా వైసీపీ నేత శ్వామలను కూడా ప్రశ్నించారు.
త్వరలో సినీ హీరోలు కూడా విచారణకు హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ కొనసాగుతున్న సమయంలో, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఆయనపై కూడా కేసులు పెట్టాలని ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో ప్రోమోట్ చేసిన వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి.
వివరాలు
బెట్టింగ్ ప్రభావం - నష్టపోతున్న ప్రజలు
ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారం కారణంగా, నమ్మిన ప్రజలు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
మరికొందరు భారీ అప్పుల్లో కూరుకుపోయారు. కొన్ని కుటుంబాలు మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
కేసు అనూహ్య మలుపు - ఫోకస్ మార్చిన పోలీసులు
ఇప్పటివరకు పోలీసులు సెలబ్రిటీలను విచారిస్తూనే, ఇప్పుడు వేరే మార్గంలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, యాప్ కంపెనీలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.
ఇప్పటికే 19 బెట్టింగ్ యాప్లను గుర్తించారు. ఆ యాప్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఇకపై క్రియాశీల చర్యలు బెట్టింగ్ కంపెనీలపైనే ఉండబోతున్నాయి.
వివరాలు
సెలబ్రిటీల భద్రత - వారు కేవలం సాక్షులేనా?
"లింక్ డౌన్లోడ్ చేసుకోండి, ఆడండి, లక్షలు గెలుచుకోండి" అంటూ బెట్టింగ్ యాప్లను విపరీతంగా ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు కేవలం సాక్షులుగానే ఉంటారని తెలుస్తోంది. ఇకపై కేసు మొత్తంగా బెట్టింగ్ యాప్ కంపెనీలపైనే నడవనుంది.
యాంకర్ శ్యామల స్పందన - వివాదాస్పద వ్యాఖ్యలు
తాజాగా యాంకర్ శ్యామల విచారణ ముగించుకుని, మీడియాతో మాట్లాడుతూ "బెట్టింగ్ మోసాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పూర్తిగా సహకరిస్తాం" అని తెలిపారు.
అయితే సెలబ్రిటీలను కేవలం సాక్షులుగానే మార్చడం వివాదాస్పదంగా మారింది.
వివరాలు
కేఏ పాల్ సంచలన ప్రకటన
ఈ కేసుపై కేఏ పాల్ తన స్టైల్లో ఘాటుగా స్పందించారు. "72 గంటల్లోపు ఆ సెలబ్రిటీలను అరెస్ట్ చేయకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్తా" అని హెచ్చరించారు.
"బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి, 980 మంది ప్రాణాలు తీసి, ఇప్పుడు క్షమించండి అంటే కుదరదు" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
బెట్టింగ్ ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను ప్రజలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు మొత్తం ఫోకస్ బెట్టింగ్ యాప్ కంపెనీలపైనే మళ్లింది. మొదట సెలబ్రిటీల మెడకు చుట్టుకుందనుకున్న కేసు, తిరిగి యాప్ నిర్వాహకులపై దృష్టి పెట్టింది. ఈ కేసులో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.