Indian Army jawan: కుల్గామ్లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు. జవాన్ ఆచూకీ కోసం సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 25 ఏళ్ల జావేద్ అహ్మద్ వానీ లేహ్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. జావేద్ అహ్మద్ స్వస్థలం కుల్గామ్లోని అచ్తల్ స్వస్థలం. పరాన్హాల్లో అతని కారును గుర్తించారు. అయితే జావేద్ అహ్మద్ కిడ్నాప్ అయిన వాదనలను భారత ఆర్మీ ఇంకా దృవీకరించలేదు.
కిరాణా సామాను కోసం వెళ్లి అదృశ్యం
ఇంటి కిరాణా సామాను తీసుకొచ్చేందుకు జావేద్ అహ్మద్ వానీ తన కారులో చౌల్గామ్కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పరాన్హాల్ సమీపంలో ఆయన కారు కనిపించింది. కారు తాళం వేసి ఉండకపోవడాన్ని బంధువులు గుర్తించారు. కారులో జావేద్ అహ్మద్ చెప్పులు, రక్తపు గుర్తులు కూడా కనిపించడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. గతేడాది నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్లోని బుద్గాం జిల్లాలోని ఓ తోటలో సైనికుడు సమీర్ అహ్మద్ మల్లాను అపహరించి హత్య చేశారు. అయితే ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకొని జావేద్ అహ్మద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.