LOADING...
Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్‌ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం
'నైపుణ్యం' పోర్టల్‌ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం

Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్‌ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ 'నైపుణ్యం' పోర్టల్‌ ను రూపొందించింది. ఈ పోర్టల్‌లో కృత్రిమ మేధ (AI) ఆధారిత ఇంటర్వ్యూ విధానం ప్రవేశపెడుతున్నారు. ప్లంబర్‌ నుండి బీటెక్‌ విద్యార్థి వరకు.. ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ ద్వారా విశ్లేషించి అంచనా వేస్తుంది. అంతేకాక, అభ్యర్థులు తమ అర్హతల వివరాల ఆధారంగా ఏఐ సహాయంతో రెజ్యుమేను కూడా తయారు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

వివరాలు 

ఆర్థిక శాఖ వద్ద ఉన్న ఉద్యోగుల వివరాలు కూడా దీనిలో భాగం కానున్నాయి

ఈ ప్లాట్‌ఫారమ్‌ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని ముఖ్యమైన డేటాబేస్‌లతో అనుసంధానమవుతుంది. ఈ-శ్రమ్,ఆధార్,డిజి లాకర్,ఈపీఎఫ్‌, ఆదాయ పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థల వివరాలు లింక్‌ చేయబడతాయి. దీనివల్ల ఎవరు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు. అంతేకాక, పాఠశాలల నుండి ఉన్నత విద్యా సంస్థల వరకు రాష్ట్ర విద్యాశాఖ ఆధీనంలోని డేటా కూడా ఈ పోర్టల్‌తో అనుసంధానం అవుతుంది. అలాగే ఆర్థిక శాఖ వద్ద ఉన్న ఉద్యోగుల వివరాలు కూడా దీనిలో భాగం కానున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో నౌకరీ, విజన్‌ ఇండియా, యునిసెఫ్‌, ఇన్ఫోసిస్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌లు వంటి ఉపాధి సంస్థలు, శిక్షణా వేదికలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు ఈ పోర్టల్‌లో నేరుగా కనిపిస్తాయి.

వివరాలు 

రెజ్యుమే తయారీ సౌకర్యం 

'నైపుణ్యం' పోర్టల్‌లో అభ్యర్థులు తెలుగు, హిందీ, ఆంగ్లం భాషలలో తమ అర్హతలకు అనుగుణంగా రెజ్యుమే రూపొందించుకోవచ్చు. ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసిన వెంటనే మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అవసరమైన వివరాలు పూర్తి చేసిన తర్వాత స్వయంచాలకంగా రెజ్యుమే సిద్ధమవుతుంది. ఈ పోర్టల్‌లో పౌరులు, ఉద్యోగార్థులు, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు, అంచనా కేంద్రాలు, శిక్షకులు, అడ్మిన్‌ విభాగాలు వంటి విభిన్న లాగిన్‌ ఆప్షన్లు ఉంటాయి.

వివరాలు 

నైపుణ్య శిక్షణ,కోర్సులు 

అభ్యర్థులు తాము ఆసక్తి చూపిన రంగంలో నైపుణ్య కోర్సులకు నమోదు చేసుకోవచ్చు. పోర్టల్‌లో అన్ని శిక్షణ వివరాలు సమగ్రంగా ఉంటాయి. కావలసిన రంగాన్ని ఎంచుకుంటే, ఆ కోర్సుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలు, నైపుణ్య కళాశాలలు ఎక్కడ ఉన్నాయో సూచించబడుతుంది. అభ్యర్థి కోర్సు వివరాలు చూడగానే.. ప్రారంభం, ముగింపు తేదీలు, అర్హతలు, వయోపరిమితి, జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్‌వర్క్‌ (NSQF) స్థాయి వంటి వివరాలు కనిపిస్తాయి. అభ్యర్థి వాటిలో తాను కోరుకున్న కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఏఐ ద్వారా సామర్థ్యాల మదింపు 

శిక్షణ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థి నేర్చుకున్న నైపుణ్యాలను ఏఐ ఆధారిత అంచనా విధానం ద్వారా మదింపు చేస్తారు. అభ్యర్థి ఏ అంశాల్లో బలంగా ఉన్నారు, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో ఏఐ స్పష్టంగా సూచిస్తుంది. ఉద్యోగావకాశాలు విభాగంలోకి వెళ్తే — ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎక్కడ ఎంతమంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో, వాటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అభ్యర్థి తాను ఆసక్తి చూపిన విభాగాన్ని ఎంచుకున్న వెంటనే, అర్హతలు, అనుభవం, వయసు, పని ప్రదేశం వంటి వివరాలు ప్రదర్శించబడతాయి.

వివరాలు 

కంపెనీల అనుసంధానం 

ఉద్యోగాలు కల్పించే సంస్థలు మరియు కంపెనీలు తమ వద్ద ఉన్న ఖాళీల వివరాలను నేరుగా పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. దీని ద్వారా నిరుద్యోగులు మరియు ఉద్యోగాలు కల్పించే సంస్థల మధ్య స్పష్టమైన అనుసంధానం ఏర్పడుతుంది. కంపెనీలు పాన్‌ కార్డు ఆధారంగా నమోదు చేసుకుని అవసరమైన అన్ని వివరాలు జోడించవచ్చు.

వివరాలు 

ఏఐ ఇంటర్వ్యూ సిస్టమ్‌ 

ఈ పోర్టల్‌లో ఏఐ ఇంటర్వ్యూ అనే ప్రత్యేక ఫీచర్‌ ఉంటుంది. అభ్యర్థి పేరు, ఉద్యోగ రకం, అనుభవం వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత, సిస్టమ్‌ టెక్నికల్‌, ప్రాక్టికల్‌ ప్రశ్నలను అడుగుతుంది. సమాధానాల ఆధారంగా అభ్యర్థి సామర్థ్యాన్ని విశ్లేషించి, అతని స్థాయి, లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. 'ఆస్క్‌ విద్య' అనే వర్చువల్‌ ఏఐ సహాయక వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ప్రదేశాలు, వచ్చే వారం ప్రారంభమయ్యే కొత్త కోర్సుల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.