Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం (NCAP) పరిధిలోని 108 నగరాల్లో వరుసగా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో PM10 స్థాయులు నిర్దేశిత పరిమితిని మించాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన 19 నగరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లో 16 నగరాలు, ఆంధ్రప్రదేశ్లో 8 నగరాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏడేసి నగరాలు, పశ్చిమ బెంగాల్లో ఆరు, రాజస్థాన్లో ఐదు నగరాలు PM10 నిర్దేశిత పరిమితిని మించినట్లు ప్రభుత్వ డేటా వెల్లడించింది.
వివరాలు
NCAP కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కేంద్రం
దేశంలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్రం NCAP కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
కాలుష్య స్థాయులు నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా నమోదవుతున్న నగరాలతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు కూడా ఈ కార్యక్రమం పరిధిలో ఉన్నాయి.
24రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 130నగరాలు NCAPలో ఉన్నాయి.
ఆయా నగరాల్లో గాలి కాలుష్యానికి కారణమయ్యే అంశాలను గుర్తించి, వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ పరిసర గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారం PM10 స్థాయి క్యూబిక్ మీటర్ గాలిలో 60మైక్రోగ్రాములు మించకూడదు.
PM10 అనేది గాలిలో ఉండే అత్యంత సూక్ష్మ ధూళి కణాలు. ఇవి శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
వివరాలు
NCAPలో పురోగతిని అంచనా వేసేందుకు 2017-18 ప్రామాణిక సంవత్సరం
అయితే 2025-26లో NCAP పరిధిలోని 108 నగరాల్లో PM10 సాంద్రత 2017-18తో పోలిస్తే తగ్గినట్లు కేంద్రం తెలిపింది.
NCAPలో పురోగతిని అంచనా వేసేందుకు 2017-18ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకున్నారు.
ఈ 108 నగరాల్లో 72 నగరాల్లో PM10 స్థాయులు 20శాతానికి పైగా తగ్గగా, 26నగరాల్లో 40 శాతానికి పైగా తగ్గాయి.
అయితే 2017-18తో పోలిస్తే కాలుష్యం తగ్గిందంటే, ప్రస్తుతం ఆ నగరాల్లో PM10 స్థాయి 60 మైక్రోగ్రాముల నిర్దేశిత వార్షిక ప్రమాణం లోపలే ఉందని అర్థం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జాతీయ పరిసర గాలి నాణ్యత ప్రమాణాలను అందుకున్న నగరాల సంఖ్య కూడా పెరిగింది.
2017-18లో కేవలం ఆరు నగరాలు ప్రమాణాలను అందుకోగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 14కు చేరింది.
వివరాలు
NCAP కింద 119 నగరాల్లో 'సోర్స్ అపోర్షన్మెంట్' అధ్యయనాలు
గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలను గుర్తించేందుకు NCAP కింద 119 నగరాల్లో 'సోర్స్ అపోర్షన్మెంట్' అధ్యయనాలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.
ఆయా నగరాల్లో కాలుష్యానికి దోహదపడుతున్న అంశాలను గుర్తించి, వాటి ఆధారంగా కార్యాచరణ ప్రణాళికల్లో ప్రాధాన్య చర్యలను నిర్ణయిస్తున్నారు.
ఈ కార్యాచరణ ప్రణాళికల్లో రహదారులను మెరుగ్గా నిర్మించడం, పచ్చదనం పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పట్టణ ప్రాంతాల్లో మినీ అటవీ ప్రాంతాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఉన్నాయి.
అలాగే శ్మశానవాటికల్లో కాలుష్యాన్ని తగ్గించే ఇంధనాలను వినియోగించడం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలను కూడా చేపడుతున్నారు.
వివరాలు
జాతీయ, రాష్ట్ర, నగర స్థాయుల్లో కమిటీల ఏర్పాటు
గాలి నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు వివిధ స్థాయిల్లో సమన్వయం కోసం జాతీయ, రాష్ట్ర, నగర స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం 292 నగరాల్లో రియల్టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
అత్యధిక కాలుష్యానికి కారణమయ్యే 17 రకాల పరిశ్రమలు ఆన్లైన్ నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది.
NCAP కింద 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2026 ఆర్థిక సంవత్సరం వరకు 130 నగరాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహక నిధుల రూపంలో రూ.16,423.56 కోట్లు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.
వివరాలు
'కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్' పథకంపై 2025 ఆగస్టులో స్వతంత్ర మూల్యాంకనం
NCAPలో భాగమైన 'కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్' పథకంపై 2025 ఆగస్టులో స్వతంత్ర మూల్యాంకనం నిర్వహించారు.
తాజా మూల్యాంకనం ప్రకారం దేశంలో గాలి నాణ్యత నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కొంతమేర కొలిచే స్థాయిలో పురోగతి సాధించింది.
అలాగే ప్రమాణాలను అందుకోలేకపోతున్న పలు నగరాల్లో పరిసర గాలి నాణ్యత మెరుగుపడటానికి కూడా కార్యక్రమం దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.