Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్నాథ్
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. రిజర్వేషన్లు చట్ట పరిధిలోనే ఉండాలని, ఇతర వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలో జరిగిన హింసను అన్ని పార్టీ ముక్తకంఠంతో ఖండించాయి.
ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ ఏర్పాటు
అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుకు సమయం ఇవ్వాలని అందరూ నిర్ణయించుకున్నారని చెప్పారు. రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనేదానిపై ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరాఠా వర్గానికి న్యాయం చేసేందుకు త్వరలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం మరాఠా సమాజం కూడా ఓపిక పట్టాలని సీఎం షిండే అన్నారు. ప్రభుత్వపై విశ్వాసం ఉంచాలని మనోజ్ జరంగే పాటిల్ను కోరుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని అభ్యర్థించారు.