Alla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్
ఇటీవల వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంగళగిరిలో శనివారం విలేకరులతో ఆర్కే మాట్లాడారు. ఇక నుంచి వైఎస్ షర్మిలతోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచారు. తాను వైఎస్ఆర్ భక్తుడిని అని చెప్పారు. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పారు. తాను తిరిగి వైసీపీలోకి పోనని ఆళ్ల స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉండేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. వైసీపీకి తాను ఎంతో సేవ చేశానని వాపోయారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. మంగళగిరిని రూ.1200కోట్లతో అభివృద్ధి చేస్తామని, కేవలం రూ.120కోట్లను మాత్రమే ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి తన హయాంలో చేసినట్లు గుర్తుచేశారు.
మళ్లీ జగన్తో కలిసి పనిచేయను: ఆర్కే
సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనప్పుడు తాను తన నియోజకవర్గ ప్రజల వద్దకు తిరిగి వెళ్లి ఓట్లు ఎలా అడగగలను? అని ప్రశ్నించారు. తన జీవితంలో మళ్లీ జగన్తో, వైఎస్సార్సీపీతో కలిసి పనిచేయనని రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీలో తన పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని, లోకేశ్ను ఓడించిన తర్వాత కూడా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్ర బాబుపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డిపై కూడా కోర్టులో కేసు వేస్తానని ఆళ్ల చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.