Arshdeep Singh: బుమ్రా రికార్డును దాటేసిన అర్ష్దీప్.. టీ20 ప్రపంచకప్లో కొత్త చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై వేదికగా జరిగిన టీమిండియా-జింబాబ్వే పోరు టీమిండియాకు భారీ ఉత్సాహాన్ని నింపింది. 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ సెమీస్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఎడమచేతి పేసర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో టీ20 వరల్డ్కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. మ్యాచ్కు ముందు ఈ రికార్డు జస్పిత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 33 వికెట్లతో ముందుండగా, అర్ష్దీప్ ఈ మ్యాచ్ అనంతరం తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కు పెంచి 'యార్కర్ కింగ్'ను అధిగమించాడు.
Details
అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డు
కేవలం 19 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతని సగటు 14.25 కాగా, ఎకానమీ 7.33గా ఉండటం అతని బౌలింగ్ స్థిరత్వాన్ని చూపిస్తోంది. ప్రస్తుత టోర్నీలోనూ ఐదు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసి జట్టులో రెండో అత్యధిక వికెట్ల బౌలర్గా కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అర్ష్దీప్ ప్రభావం కనిపించింది. తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఒత్తిడి సృష్టించాడు. రెండో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చినప్పటికీ, చివరి దశలో తిరిగి వచ్చి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు మలిచాడు. 17వ ఓవర్లో సికిందర్ రాజా (21 బంతుల్లో 31)ను లాంగ్-ఆన్లో క్యాచ్ అవుట్ చేయించాడు.
Details
జింబాబ్వేపై భారీ స్కోరు సాధించిన టీమిండియా
వెంటనే ర్యాన్ బర్ల్ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి రెండు బంతుల్లోనే డక్గా పెవిలియన్కు పంపించాడు.చివరి ఓవర్లో టోనీ మునియోంగా స్టంప్స్ను ఎగరగొట్టి తన మూడు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. మొత్తంగా 184/6కే జింబాబ్వేను పరిమితం చేసి భారత్కు సునాయాస విజయాన్ని అందించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 256/4 అనే భారీ స్కోరు నమోదు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు రాణించని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడి 30 బంతుల్లో 55 పరుగులతో తన తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అతని దాడి ఆరంభం జట్టుకు బలమైన పునాది వేసింది.
Details
చివర్లో హాఫ్ సెంచరీ రాణించిన పాండ్యా
చివర్లో హర్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50*), తిలక్ వర్మ (16 బంతుల్లో అజేయ 44) కలిసి కేవలం 31 బంతుల్లోనే 81 పరుగుల అద్భుత భాగస్వామ్యం నమోదు చేసి జింబాబ్వే బౌలర్లను ఇబ్బందులకు గురిచేశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం చాటిన భారత్ ఈ విజయంతో సెమీస్ ఆశలను గట్టిగా నిలబెట్టుకుంది.