Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ భారీ డేటా సెంటర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కొత్త డేటా సెంటర్ విస్తరణకు సిద్ధమైంది. వచ్చే 12 సంవత్సరాల్లో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం,అమెజాన్ సంస్థ మధ్య ఇప్పటికే పరస్పర అంగీకారం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు,చందన్వెల్లిలో మరో 98ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అదనంగా రూ.125కోట్ల విలువైన ప్రోత్సాహకాలు,రాయితీలను కూడా సంస్థకు అందించింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒక మైలురాయిగా నిలవనుంది.
వివరాలు
ప్యూర్ ప్రాంత అభివృద్ధికి కీలక ప్రాజెక్టు
కొత్తగా ఏర్పాటు చేయనున్న అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన చేయనున్నారు.
డిజిటల్ ప్రపంచానికి వెన్నెముకగా నిలిచే డేటా సెంటర్ల ఏర్పాటుకు బహుళజాతి సంస్థలు తెలంగాణపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి.
పరిశ్రమలకు అవసరమైన భూమి అందుబాటులో ఉండటం,నీరు,విద్యుత్,రహదారులు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.
ఈ నేపథ్యంలోనే అమెజాన్ సంస్థ తెలంగాణలో వచ్చే పన్నెండేళ్లలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్లలో ఒకటి అందుబాటులోకి రానుంది.
వివరాలు
24 నెలల్లో తొలి దశ పూర్తి
అలాగే ముంబయి తర్వాత భారతదేశంలో రెండో క్లౌడ్ రీజియన్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.
పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్)ప్రాంత అభివృద్ధికి ఈ డేటా సెంటర్ కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తొలి దశ నిర్మాణ పనులను 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అనంతరం మిగిలిన విస్తరణ పనులను వచ్చే 10 సంవత్సరాల్లో దశలవారీగా పూర్తి చేయనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ),డిజిటల్ బ్యాంకింగ్,ఈ-కామర్స్,ఆరోగ్య సేవలు,ప్రభుత్వ డిజిటల్ సేవలు,స్టార్టప్లు,పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ రంగాల అభివృద్ధిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కీలక పాత్ర పోషించనున్నట్లు భావిస్తోంది.
వివరాలు
నేడు మహబూబ్నగర్, వనపర్తిలో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు.
మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో అమరరాజ సంస్థ ఏర్పాటు చేసిన సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్ను ప్రారంభిస్తారు.
అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.
తర్వాత 1,500 మంది విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.