PM Modi: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య యూఏఈకి ప్రధాని మోదీ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (మే 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ టూర్ జరుగుతోంది. యూఏఈలో తాత్కాలిక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇంధన భద్రత ప్రధాన అంశంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో సముద్ర రవాణాపై ప్రభావం పడింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తుండగా, అమెరికా ఇరాన్ పోర్టులపై నౌకాదళ ఆంక్షలు అమలు చేస్తోంది.
వివరాలు
100 బిలియన్ డాలర్లు దాటిన ద్వైపాక్షిక వాణిజ్యం
ఈ పరిస్థితుల్లో భారత ఇంధన అవసరాల భద్రతపై మోదీ-అల్ నహ్యాన్ చర్చలు కీలకంగా మారాయి. ఈ పర్యటన సందర్భంగా ఎల్పీజీ సరఫరాలు, వ్యూహాత్మక చమురు నిల్వలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరే అవకాశముందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ,యూఏఈ భారత్కు కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోంది. దీర్ఘకాలిక ఒప్పందాల కారణంగా భారత్కు ఇంధన సరఫరాల్లో స్థిరత్వం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను దాటింది. 2032 నాటికి దీన్ని రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే భారత్లో అత్యధిక పెట్టుబడులు పెట్టే దేశాల్లో యూఏఈ ఏడో స్థానంలో ఉంది.ఇప్పటివరకు 25.19 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది.
వివరాలు
భారత్-యూఏఈ మధ్య స్థానిక కరెన్సీ చెల్లింపు విధానం
భారత్-యూఏఈ మధ్య స్థానిక కరెన్సీ చెల్లింపు విధానం కూడా అమల్లో ఉంది. దీని ద్వారా భారత రూపాయి, యూఏఈ దిర్హామ్లలోనే వాణిజ్య లావాదేవీలు, నగదు పంపకాలు జరుపుకోవచ్చు. దీంతో అమెరికన్ డాలర్పై ఆధారపడటం తగ్గడమే కాకుండా లావాదేవీ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఇక యూఏఈలో భారతీయులే అతిపెద్ద ప్రవాస వర్గంగా ఉండి, భారత్కు భారీగా నగదు పంపకాలు చేస్తున్నారు.