Page Loader
Kolkata doctor murder case: కోల్‌కతా ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..!
కోల్‌కతా ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..!

Kolkata doctor murder case: కోల్‌కతా ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలనం సృష్టించిన సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ సమర్పించిన రిపోర్టులో కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి శరీరంపై ఒక మహిళ డీఎన్ఏని గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ 100 శాతం మృతురాలి శరీరంపై కనిపించింది. అదే సమయంలో, ఒక మహిళ డీఎన్ఏ కూడా కొంత స్థాయిలో శరీరంపై గుర్తించబడింది. అయితే, ఆ మహిళ డీఎన్ఏ సాంద్రత గమనించబడిన ప్రదేశం పై మరింత వివరణ అవసరమైంది.

వివరాలు 

వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయలేదు 

అది పొరపాటున శరీరంపై కలిసిందా లేదా ఆమె కూడా నేరంలో భాగమైందా అన్నది విచారణలో స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో భాగంగా జూనియర్ వైద్యురాలి శవపరీక్ష వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి "పోస్టుమార్టం సమయంలో వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయలేదని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. వైద్య సిబ్బంది సరిగ్గా ప్రోటోకాల్‌ను పాటించకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇతర సదుపాయాలు లేకపోవడం వల్ల, వారు ఈ విధానాలు పాటించలేక పోయారు" అని తెలిపారు.

వివరాలు 

కేసులో మరికొందరు ప్రమేయం.. జూనియర్ వైద్యురాలి తండ్రి

ఇదిలా ఉంటే, జూనియర్ వైద్యురాలి తండ్రి ఈ కేసులో మరికొందరు ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. "మా కూతురు గొంతుపై గాయాలు ఉన్నా, స్వాబ్ సేకరించలేదు. సీబీఐ కేసును త్వరగా విచారించట్లేదని ఆరోపించారు" అని ఆయన పేర్కొన్నారు. డీఎన్ఏ రిపోర్టులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి, ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనా స్థలంలో సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు.

వివరాలు 

సంజయ్ రాయ్‌కు మరణశిక్ష ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థన 

న్యాయస్థానం, సాక్ష్యాధారాలను పరిశీలించి అతడిని దోషిగా తేల్చింది. శిక్ష విధించడానికి ముందు, సంజయ్ రాయ్ తనపై పెట్టిన ఆరోపణలను అంగీకరించకుండా, "నేను నేరం చేయలేదు" అంటూ తన వాదనలు సమర్పించాడు. ఈ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు అభ్యర్థించింది. ఈ మేరకు, మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే, సియాల్దా అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి రాదని పేర్కొన్నారు.