
Andhra Pradesh: చికెన్ దుకాణాలకు లైసెన్సులు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రతీ చికెన్ దుకాణం తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, కోళ్లు ఏ పౌల్ట్రీ నుంచి వస్తున్నాయి, వాటిని దుకాణదారులు ఎవరికీ విక్రయిస్తున్నారు అనే సమాచారాన్ని సులభంగా గుర్తించగల విధంగా సమగ్ర ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయాలని బోర్డు సూచించింది. ఈ నిర్ణయాలు విజయవాడలోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో తీసుకున్నారు. సమావేశానికి మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ చంద్ర దండు ప్రకాశ్నాయుడు అధ్యక్షత వహించగా, డైరెక్టర్లు ప్రవీణ్, అజ్ముద్దీన్, పశుసంవర్ధకశాఖ సంచాలకులు టి. దామోదర్నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
వివరాలు
సమావేశంలో నిర్ణయించిన ప్రధాన అంశాలు ఇవి..
వైఎస్సార్సీపీ పాలన సమయంలో చోటుచేసుకున్న మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. చికెన్, మటన్ దుకాణాలను పూర్తిగా క్రమబద్ధీకరించడం. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మాంసం దుకాణాలపై అకస్మాత్తుగా తనిఖీలు జరిపి, లోపాలు కనబడితే వెంటనే చర్యలు తీసుకోవడం. గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే హోటల్ యజమానులు మాంసం కొనుగోలు చేయాలని ప్రోత్సహించడం. స్టెరాయిడ్లు వాడిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నిషేధించడం. చికెన్ దుకాణాల వ్యర్థాలను చేపల ఆహారంగా వాడే అక్రమ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం. వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి హాని కలగని విధంగా సక్రమంగా పారవేయడం. చట్టవిరుద్ధంగా నడుస్తున్న కబేళాలపై దాడులు చేయడం.
వివరాలు
సమావేశంలో నిర్ణయించిన ప్రధాన అంశాలు ఇవి..
కేరళ, థాయిలాండ్ వంటి రాష్ట్రాలు, దేశాలకు గోవులను అక్రమంగా తరలించకుండా పటిష్ట నియంత్రణ విధించడం. పీ-4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రతి ప్రాంతంలో ఒక మోడల్ మాంసం దుకాణం ఏర్పాటు చేయడం. రాష్ట్రవ్యాప్తంగా జరిగే పశు సంతలను నిరంతరం పర్యవేక్షించడం. ప్రజలకు నాణ్యమైన మాంసం అందుబాటులో ఉంచి "ఆరోగ్య ఆంధ్రప్రదేశ్" లక్ష్యం సాధించే దిశగా ముందడుగు వేయడం.