Delhi: ఢిల్లీలో మరో షాక్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది. వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భారీగా అమ్మోనియం నైట్రేట్తో పాటు అధునాతన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. దర్యాప్తు ఈ దిశగా కొనసాగుతుండగానే, మరో అంతర్జాతీయ ఆయుధాల రవాణా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఈ రాకెట్ బట్టబయలైంది. రోహిణి ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల సహాయంతో ఈ ఆయుధాలు భారతదేశానికి పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Details
పంజాబ్ మార్గంగా దిల్లీకి చేరాయి
పంజాబ్లోని పేరుమోసిన గ్యాంగ్స్టర్ గుంపులకు ఈ ఆయుధాలు అందాల్సి ఉన్నట్లు విచారణలో బయటపడింది. టర్కీ, చైనాలో తయారైన ఈ అధునాతన తుపాకులు, పంజాబ్ మార్గంగా ఢిల్లీకి చేరినట్లు తెలిపారు. వీటిని లౌరేష్ బిష్ణోయ్, బాంబిహా, గోగి, హిమాన్షు భావు గ్యాంగ్లకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే పోలీసులు రోహిణిలో వల వేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టైన నిందితులను గట్టిగా విచారిస్తున్నారు. ఆయుధాల సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ను బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన నలుగురు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారని అధికారులు ధ్రువీకరించారు.