Loading...
Andhra Pradesh: నాగార్జునసాగర్‌,కర్నూలులో ఎఫ్‌టీవో.. డ్రోన్‌ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి
నాగార్జునసాగర్‌,కర్నూలులో ఎఫ్‌టీవో.. డ్రోన్‌ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి

Andhra Pradesh: నాగార్జునసాగర్‌,కర్నూలులో ఎఫ్‌టీవో.. డ్రోన్‌ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన, డ్రోన్‌ రంగాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. నాగార్జునసాగర్‌ లేదా కర్నూలు విమానాశ్రయాల్లో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీవో) ఏర్పాటు చేయాలని దిల్లీకి చెందిన నాట్స్‌ ఏరోస్పేస్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి అథిరాజ్‌ సింగ్‌ చావ్లా గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసి ప్రతిపాదనపై చర్చించారు. రాబోయే ఐదేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి సుమారు 100 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని సంస్థ భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరు శిక్షణ విమానాలతో ప్రారంభించి, భవిష్యత్తులో వాటి సంఖ్యను 20కి పెంచేలా ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ను విస్తరించే ప్రణాళికను మంత్రికి వివరించారు.

వివరాలు 

జీజీఎఫ్‌ ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ఆసక్తి

ఈ ప్రతిపాదనపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

పూర్తి వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించాలని సూచిస్తూ, ప్రభుత్వ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సందర్భంగా కర్నూలు డ్రోన్‌ సిటీలో భారీ పెట్టుబడులతో డ్రోన్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌కు చెందిన జీజీఎఫ్‌ ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది.

సంస్థ సీఈవో, డైరెక్టర్‌ సాయిప్రసాద్‌, టెక్‌ డైరెక్టర్‌ సాయివిజ్ఞాన్‌రెడ్డి, ఆపరేషన్‌ డైరెక్టర్‌ టీఎస్‌ కిరణ్‌లు మంత్రి జనార్దన్‌రెడ్డిని సచివాలయంలో కలిసి పెట్టుబడి ప్రతిపాదనపై చర్చించారు.

వివరాలు 

కర్నూలు డ్రోన్‌ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన

రూ.400 కోట్ల పెట్టుబడితో డ్రోన్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, ఇందుకు సుమారు 100 ఎకరాల భూమి అవసరమవుతుందని సంస్థ ప్రతినిధులు వివరించారు.

అలాగే రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా డ్రోన్‌ ఆధారిత సేవలను అందించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు.

ఈ ప్రతిపాదనలపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, అన్ని సాంకేతిక, ఆర్థిక వివరాలతో కూడిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు సమర్పించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

ADVERTISEMENT