LOADING...
Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్మాణాలకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, జలవనరుల వినియోగం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం అధికారిక ఆమోదం తెలిపింది.

వివరాలు 

క్యాబినెట్ నిర్ణయాల వివరాలు

రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనను ఆమోదించింది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే చర్యలతో దాదాపు 17 వేల మందికి ఉపాధి లభించేలా నిర్ణయం తీసుకుంది. సుమారు 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనలకు కూడా అనుమతి ఇచ్చింది. ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు రాయితీలు కల్పించే అంశాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది.

వివరాలు 

క్యాబినెట్ నిర్ణయాల వివరాలు

మిషన్ శక్తి పథకం కింద 'సఖీ నివాస్' పేరుతో పనిచేసే మహిళల కోసం క్రెచ్ సౌకర్యాలతో కూడిన హాస్టళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఉన్న అప్పీల్ కార్యాలయాల పరిధి అంశంపై కూడా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌లో పోలవరం, మార్కాపురం జిల్లాలను చేర్చే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపే అజెండాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్‌లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనుల కోసం రూ.23.47 కోట్ల నిధులు కేటాయించింది.

Advertisement

వివరాలు 

క్యాబినెట్ నిర్ణయాల వివరాలు

పోలవరం ప్రాజెక్ట్ ప్యాకేజ్-64 పనుల కోసం రూ.24.51 కోట్ల మంజూరుకు కూడా అనుమతి ఇచ్చింది. ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో అత్యవసర మరమ్మతు పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల ప్రోత్సాహం, అలాగే జలవనరుల నిర్వహణకు ప్రభుత్వం మరింత వేగం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement