AP Excise Policy: బార్ నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. బార్ నిర్వాహకులకు ఊరటనిచ్చేలా బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET)ను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక ARETను ఇకపై తొలగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్కుమార్ మీనా జీఓ ఎంఎస్ నంబర్-24ను జారీ చేశారు. ఈ మార్పులతో రిటైల్ మద్యం దుకాణాలు, బార్ల మధ్య ధరల తేడాకు తెరపడనుంది. ఇకపై ఒకే మద్యానికి రెండు వేర్వేరు ధరలు ఉండవని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ధరల్లో సమానత్వాన్ని పునరుద్ధరించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వివరాలు
బార్ల వ్యాపారులకు పెద్ద ఊరట
అలాగే APSBCL డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్ (IMFL), ఎఫ్ఎల్ (FL) మద్యంపై అదనపు పన్ను విధించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లోనూ అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు పెద్ద ఊరటగా మారనుంది.
వివరాలు
నేటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి..
అదనపు పన్ను రద్దుతో వ్యాపార ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ మార్పుల అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్తో పాటు APSBCL అధికారులు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచి, అంటే 2026 జనవరి 13 నుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు ధరల సమానత్వం రావడంతో బార్లకు ఇది నిజంగా 'బిగ్ రిలీఫ్'గా మారిందని చెప్పుకోవచ్చు.