Andhra Pradesh: ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీ మార్గదర్శకాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ-4.0 అమలు మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ పాలసీ నిబంధనలు 2025 నుంచి 2030 వరకూ అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పాలసీ అమలు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఏపీఐఐసీ వీసీఎండీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఎండీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సర్క్యులర్ ఎకానమీ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్లస్టర్లలో ఉండాల్సిన మౌలిక వసతులపై పాలసీలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
వివరాలు
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతీయ పార్కుల అభివృద్ధి
అనంతపురం-శ్రీసత్యసాయి, కర్నూలు-కడప, విశాఖపట్నం-విజయనగరం, కృష్ణా-గోదావరి, శ్రీసిటీ-తిరుపతి ప్రాంతాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అదనంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతీయ పార్కులను అభివృద్ధి చేయాలని కూడా పేర్కొంది. ఈ పార్కుల్లో అడ్వాన్స్డ్ రీసైక్లింగ్ సదుపాయాలు, కో-ప్రాసెసింగ్ లింకేజీలు, ప్లగ్ అండ్ ప్లే సేవలు తప్పనిసరిగా ఉండాలని సూచించింది. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పర్యవేక్షణకు అనుసరించాల్సిన విధానాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యర్థాల రికవరీ, రీసైక్లింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు నిల్వ విధానాలు, వ్యర్థాల డిస్పోజల్ సదుపాయాలు, వాహనాల నమోదు వంటి అంశాలపై కూడా స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది.
వివరాలు
పీసీబీ నివేదిక
ఇదిలా ఉండగా రాష్ట్రంలో బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, సిమెంట్, స్టీల్, కెమికల్స్, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా పరిశ్రమలు ప్రమాదకరమైనవి, ప్రమాదరహితమైనవి రెండూ కలిపి భారీగా వ్యర్థాలను విడుదల చేస్తున్నట్లు పీసీబీ నివేదికలో వెల్లడైంది.