LOADING...
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాన్ని నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో స్థాపించనున్నట్లు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ అత్యాధునిక సదుపాయాన్ని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇది భారత నౌకాదళం, అలాగే సముద్ర మరియు రక్షణ తయారీ రంగానికి ఒక కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్-జనరేషన్ నౌకాదళ సాంకేతికతలు, స్వయంప్రతిపత్తి వ్యవస్థల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా అవతరించనుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది.

వివరాలు 

ప్రత్యేక అటానమస్ నౌకానిర్మాణ కేంద్రం 

ఈ షిప్‌యార్డ్‌ను పూర్తిగా మానవ రహిత, స్వయంచాలక సముద్ర వేదికల (Autonomous & Unmanned Maritime Platforms) నిర్మాణంపై దృష్టి సారించేలా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో సుమారు 750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో 300 మందికి ప్రత్యక్షంగా, 450 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించబడతాయి. దీనివల్ల రాష్ట్ర తీరప్రాంతంలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

వివరాలు 

అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ అంటే ఏమిటి? 

అధికారిక సమాచారం ప్రకారం,అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ అనేది ఒక అత్యాధునిక పారిశ్రామిక కేంద్రం. ఇందులో స్వయంప్రతిపత్తి కలిగిన, మానవ రహిత ఉపరితల నౌకలు మరియు నీటి అడుగున పనిచేసే నౌకల నిర్మాణం,ఏకీకరణ,పరీక్షలు,అలాగే వాటి జీవితచక్ర నిర్వహణ (Lifecycle Support) జరుగుతుంది. ఈ కేంద్రంలో ఇంటెలిజెంట్ మారిటైమ్ సిస్టమ్స్, ఆధునిక సెన్సార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సాంకేతికతలు అభివృద్ధి చేయబడతాయి. ఇటువంటి షిప్‌యార్డ్‌లు ఆధునిక నౌకాదళ అవసరాలకు అత్యంత కీలకమని ప్రభుత్వం పేర్కొంది. మానవ జోక్యం లేకుండానే తీర నిఘా, సముద్ర పరిధి అవగాహన,తీర భద్రత,రక్షణ సిద్ధతను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది.

Advertisement

వివరాలు 

భూ కేటాయింపు వివరాలు 

జువ్వలదిన్నెలో ప్రతిపాదిత ఈ షిప్‌యార్డ్,స్వదేశీ రక్షణ సాంకేతికతల అభివృద్ధి,నౌకాదళ రంగంలో స్వయం సమృద్ధి సాధనకు భారతదేశం పెట్టుకున్న లక్ష్యాలకు బలమైన మద్దతుగా నిలుస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా లీజు పద్ధతిలో కేటాయించింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిధిలో మొత్తం 29.58 ఎకరాల భూమిను ప్రాజెక్ట్‌కు అందజేశారు. ఇందులో 7.58 ఎకరాలు సముద్రానికి ఆనుకుని ఉన్న వాటర్‌ఫ్రంట్ భూమి, అలాగే 22.00 ఎకరాలు హార్బర్ భూమిగా ఉన్నాయి. ఈ భూమి షిప్‌బిల్డింగ్, అటానమస్ మారిటైమ్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణకు అవసరమైన సముద్రానికి ప్రత్యక్ష ప్రవేశాన్ని కల్పించనుందని అధికారులు వెల్లడించారు.

Advertisement