AP Free Electricity: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వృత్తిదారులకు ఉచిత విద్యుత్ పథకం అమలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పేద, బీసీ వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బీసీ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ముఖ్యంగా రజకులు, స్వర్ణకారులు, నాయీబ్రాహ్మణులు, ఇతర అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు వర్తిస్తుంది. వృత్తి ఆధారంగా విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. పథకం ప్రకారం సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల వరకు, లాండ్రీ షాపులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, అలాగే బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
వివరాలు
అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
అర్హత ఉన్న వారు ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్తో APSPDCL సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AE) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు తదితర 32 ఉపకులాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.