AP SEC: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫేక్.. ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనధికారిక సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో తప్పుడు ప్రచారం స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఎస్ఈసీ వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక గుర్తులను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది.
వివరాలు
వాట్సప్లో వస్తున్న తేదీలను నమ్మొద్దు
ఈ ప్రచారం నిజమా? కాదా? అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది.
సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్లో షేర్ అవుతున్న స్థానిక ఎన్నికల తేదీలు నకిలీవేనని అనిల్చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
ఆ షెడ్యూల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వాట్సప్లో వస్తున్న ఎన్నికల తేదీలను ప్రజలు నమ్మకూడదని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదని సూచించారు.
వివరాలు
ఫేక్ షెడ్యూల్ షేర్ చేస్తే సైబర్ కేసులు
ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించింది.
నకిలీ ఎన్నికల షెడ్యూల్ను షేర్ చేసే వారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది.
అధికారిక గుర్తులను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.
అధికారిక ప్రకటన ద్వారానే ఎన్నికల సమాచారం
స్థానిక ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పత్రికా ప్రకటన లేదా మీడియా సమావేశం ద్వారానే వెల్లడిస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు సోషల్ మీడియాలో, వాట్సప్లో వచ్చే అనధికారిక సమాచారాన్ని విశ్వసించవద్దని ప్రజలకు సూచించింది.