Andhra Pradesh: ఏపీలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు.. ఏర్పాటుకు 20 ప్రాంతాల గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో మరో 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో 20అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనాల ఆధారంగా ఈ లొకేషన్లను నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్క్యాప్)ఎంపిక చేసింది. అందుబాటులో ఉన్న నీటి వనరులు,భూమి పరిస్థితులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, వాణిజ్య సాధ్యత నివేదిక (టీసీఎఫ్ఆర్)ను నెడ్క్యాప్ ఇప్పటికే సిద్ధం చేసింది. తదుపరి దశలో ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలు, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్లు) రూపొందించనుంది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే రాష్ట్రానికి సుమారు రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఎన్టీపీసీతో ఒప్పందం.. సామర్థ్యం పెరుగుదల
ఐదు ప్రాంతాల్లో 7,450 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీపీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించిన 31,800 మెగావాట్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం పీఎస్పీ ప్రాజెక్టుల సామర్థ్యం 55,750 మెగావాట్లకు చేరనుంది.
వివరాలు
ఆరు జిల్లాల్లో కొత్త ప్రాజెక్టుల గుర్తింపు
అధికారులు ఆరు జిల్లాల్లో కొత్త ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో - 1,650 మెగావాట్లు ఏఎస్ఆర్ జిల్లాలో - 12 లొకేషన్లలో 17,150 మెగావాట్లు పార్వతీపురం మన్యం - 3 లొకేషన్లలో 2,050 మెగావాట్లు వైఎస్సార్ కడప - 2 లొకేషన్లలో 2,000 మెగావాట్లు తిరుపతి - 1,000 మెగావాట్లు నంద్యాల - 180 మెగావాట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 21,153 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అందులో సుమారు 8 వేల మెగావాట్లు సౌర, పవన విద్యుత్కు చెందినవి. అయితే గ్రిడ్ నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీఎస్పీ ప్రాజెక్టులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
ఇప్పటికే కేటాయింపులు.. పెట్టుబడుల ప్రవాహం
గతంలో 23 ప్రాంతాల్లో 31,900 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించింది. ఈ ప్రాజెక్టుల పూర్తి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే 2,600 మెగావాట్ల సామర్థ్యంతో మూడు ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు వివిధ కారణాలతో ముందుకు రాకపోవడంతో వాటి డీపీఆర్ల తయారీని నెడ్క్యాప్ నిలిపివేసింది. మిగిలిన 29,300 మెగావాట్ల ప్రాజెక్టుల అమలుకు ముందుకు వచ్చిన సంస్థలు రూ.1,64,955 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.
వివరాలు
నిలిచిపోయిన ప్రాజెక్టులు
కొన్ని ప్రాజెక్టులు అనుమతుల సమస్యలు, స్థానిక అభ్యంతరాల కారణంగా నిలిచిపోయాయి. శిరిడీసాయి ఎలక్ట్రికల్స్కు వైఎస్సార్ కడపలో కేటాయించిన 900 మెగావాట్ల ప్రాజెక్టు, అలాగే ఏఎస్ఆర్ జిల్లా ఎర్రవరంలో 1,200 మెగావాట్ల ప్రాజెక్టులకు అటవీ భూములు, గిరిజనుల అభ్యంతరాలు అడ్డంకిగా మారాయి. దీంతో డీపీఆర్లు నిలిపివేశారు. జేఎస్డబ్ల్యూ సంస్థకు కడప జిల్లా వేంపల్లి సమీపంలో కేటాయించిన 500 మెగావాట్ల ప్రాజెక్టు కూడా అటవీ భూముల కారణంగా అనుమతులు పొందడం కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిన పైడిపాలెం నార్త్, పైడిపాలెం తూర్పు ప్రాంతాల్లో 3,500 మెగావాట్ల సౌర, 1,500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులపై డెవలపర్ ఆసక్తి చూపకపోవడంతో అవి ముందుకు సాగడం లేదు.