Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది. రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో శనివారం భూమిపూజ నిర్వహించారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్ఐపీ), దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కో-లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్కు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ. 2,387 కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 2,500 మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా..
ఈ సందర్భంగా ఏఎస్ఐపీ సంస్థ ఎండీ, సీఈవో వెంకటసింహాద్రి మాట్లాడుతూ.. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు తొలి ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) ఫెసిలిటీ ఇదే.
దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కో-లిమిటెడ్తో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
ఏపీఏసీటీ కో-లిమిటెడ్ సీఈవో ఎస్డీ లీ మాట్లాడుతూ.. సెమీకండక్టర్ రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయం. ఈ రంగంలో దక్షిణ కొరియాకు విశేష అనుభవం ఉంది.
వివరాలు
ఈ రెండు దేశాల బలాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు
భారతదేశానికి అత్యుత్తమ ప్రతిభ, విస్తారమైన మార్కెట్, బలమైన జాతీయ వృద్ధి ఉన్నాయి. ఈ రెండు దేశాల బలాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈఓ అమితేష్ సిన్హా మాట్లాడుతూ.. సెమీకండక్టర్ రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఈ ప్రాజెక్టు ఒక అద్భుత ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు హార్డ్వేర్, సెమీకండక్టర్ రంగాలదేనని వ్యాఖ్యానించారు.