Loading...
AP Transport Connect: ఓలా తరహాలో లారీ బుకింగ్‌.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్
ఓలా తరహాలో లారీ బుకింగ్‌.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్

AP Transport Connect: ఓలా తరహాలో లారీ బుకింగ్‌.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలను ర్యాపిడో, ఓలా, ఉబర్‌ వంటి యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకున్నట్లే.. ఇకపై సరకు రవాణా కోసం లారీలు, ఇతర గూడ్స్‌ వాహనాలను కూడా సులభంగా బుక్‌ చేసుకునే అవకాశం రానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' (AP Transport Connect) పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైతులు, వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లు, లారీ యజమానులు, డ్రైవర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సరకు రవాణాను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ యాప్‌ ప్రధాన లక్ష్యం.

వివరాలు 

ఒకే వేదికపై రవాణా వ్యవస్థ

సరకు రవాణాలో కీలక పాత్ర పోషించే రైతులు, వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు, లారీ యజమానులు, డ్రైవర్లు ఈ యాప్‌ ద్వారా పరస్పరం అనుసంధానమవుతారు.

దీనివల్ల ఖాళీగా తిరిగే వాహనాల సంఖ్య తగ్గి, ఇంధన వ్యయం తగ్గడంతో పాటు వాహనాల వినియోగం పెరిగి అందరికీ ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

యాప్‌ ఎలా పనిచేస్తుంది?

ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు, లారీ యజమానులు తమ వాహనాల వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు.

నమోదు చేసిన సమాచారం యాప్‌ను ఉపయోగించే వారికి అందుబాటులో ఉంటుంది.

సరకు రవాణా కోసం ఏ ప్రాంతంలో ఏ లారీ అందుబాటులో ఉందో తెలుసుకుని నేరుగా బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

జీపీఎస్‌ (GPS) ట్రాకింగ్‌ సాయంతో లారీ ఎక్కడ ఉందో, ప్రయాణం ఎలా కొనసాగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యం

ఈ యాప్‌లో వాహనాలకు సంబంధించిన కేసులు, డ్రైవర్‌ చరిత్ర వంటి వివరాలు కూడా అందుబాటులో ఉండటంతో రవాణా వ్యవస్థ మరింత పారదర్శకంగా, భద్రంగా మారనుంది.

కందుకూరు రవాణా అధికారిణి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, రవాణా శాఖ అధికారులు లేదా పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు లారీ డ్రైవర్లు యాప్‌లోని వివరాలను చూపించి అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు.

విపత్తుల సమయంలోనూ ఉపయోగం

ప్రకృతి విపత్తులు లేదా రోడ్డు ప్రమాదాల కారణంగా లారీ ఎక్కడైనా చిక్కుకుపోతే, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా దాని స్థానాన్ని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

దీంతో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం సాధ్యమవుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

యజమానుల గోప్యతకు భరోసా

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సుశీల మాట్లాడుతూ, యాప్‌లో వాహన యజమానుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకుండా పూర్తి గోప్యత పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు, వాహన యజమానులకు ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్‌ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో సరకు రవాణా మరింత సులభతరం కావడంతో పాటు సమయం, ఇంధనం, వ్యయాన్ని ఆదా చేసే అవకాశం ఏర్పడనుంది.

ADVERTISEMENT