Apollo Tyres: ఏపీలో అపోలో టైర్స్ రెండో దశ విస్తరణ.. రూ.1,100 కోట్లతో కొత్త ప్రాజెక్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో అపోలో టైర్స్ సంస్థ రెండో దశ విస్తరణలో భాగంగా సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి దశలో భాగంగా రూ.3,800 కోట్ల వ్యయంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీ సమీపంలోని చినపాండూరు ప్రాంతంలో 256 ఎకరాల విస్తీర్ణంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం మూడు దశల్లో ఈ సంస్థ రూ.5,810 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
వివరాలు
1,800 మందికి ఉద్యోగావకాశాలు
గత ఏడాది సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసింది. అలాగే పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపుతో పాటు కంపెనీకి అవసరమైన విద్యుత్, నీటి సరఫరా కల్పించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,800 మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయని సంస్థ తన డీపీఆర్లో స్పష్టం చేసింది.