LOADING...
APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్ రిక్రూట్‌మెంట్‌లో భారీ అవకతవకలు.. 69 మందిపై చర్యలు
ఏపీఎస్‌పీడీసీఎల్ రిక్రూట్‌మెంట్‌లో భారీ అవకతవకలు.. 69 మందిపై చర్యలు

APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్ రిక్రూట్‌మెంట్‌లో భారీ అవకతవకలు.. 69 మందిపై చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో భారీ నియామక అవకతవకలు బయటపడ్డాయి. సంస్థ పరిధిలోని వివిధ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో నిబంధనలను పక్కనబెట్టి అక్రమాలు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ విధానంలో జరిగిన ఈ నియామకాలలో నకిలీ అర్హత పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన APSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి, పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

ఫేక్ సర్టిఫికెట్లతో నియామకం పొందిన 69 మంది అభ్యర్థులు

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన కొందరు అభ్యర్థులు ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్ధారణ అయింది. మొత్తం 69 మంది అభ్యర్థులు ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లతో నియామకం పొందినట్లు విచారణలో తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది ఉన్నారు. కర్నూలులో 16 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, తిరుపతిలో 3 మంది, అనంతపురంలో 3 మంది, అన్నమయ్య జిల్లాలో 1 వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు 

విద్యుత్ శాఖలో నియామకాల పారదర్శకతపై తీవ్ర అనుమానాలు

ఈ నేపథ్యంలో నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలని సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు APSPDCL యాజమాన్యం నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలాగే, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్లకు స్పష్టం చేసింది. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో నియామకాల పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ఇక ఈ స్కాంలో అసలు బాధ్యులు ఎవరు?, మరింత లోతైన దర్యాప్తు జరుగుతుందా?, మరిన్ని పేర్లు బయటపడతాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement