APSRTC: ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్ఆర్టీసీకి 2,500 కొత్త బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
పీఎం ఈ-బస్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)కు 1,050 విద్యుత్ బస్సులు అందనున్నాయి. అదనంగా మరో 1,450 విద్యుత్ మరియు సిఎన్జీ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ, రవాణా, ఆర్అండ్బీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మొత్తంగా 2,500 కొత్త బస్సులు ఆర్టీసీకి చేరనున్నాయి. ఆయన ఆర్టీసీ హౌస్లో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ, ప్రయాణికులకు అందుతున్న సేవలపై 'ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం ఫీడ్బ్యాక్' సేకరిస్తోందని ముఖ్యమంత్రి తరచుగా ఈ ఫీడ్బ్యాక్ను పరిశీలిస్తున్నారని చెప్పారు.
Details
మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం
ప్రస్తుతం బస్సులు, బస్టాండ్లలో వసతులపై 80శాతం ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మిగిలిన 20శాతం సంతృప్తి కోసం మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, ఇతర వసతులు పెంచడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాక, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఎండీ వెల్లడించారు. ఈ కొత్త బస్సులు చేరిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక రవాణా సేవలు అందనున్నాయి.