Page Loader
MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు

MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మేళాకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవియా సహా 77 దేశాల ప్రతినిధులు తొలిసారిగా కుంభమేళాలో పాల్గొన్నారు.

Details

యోగి ఆదిత్యనాథ్ కు ఘన స్వాగతం

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా ఈ మేళాను సందర్శించగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. లిథువేనియా రాయబారి డయానా మికెవిసీన్ మాట్లాడుతూ భారత్‌తో తమకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు కుంభమేళాకు వచ్చే అవకాశం రాలేదని, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నేపాల్ రాయబారి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, కుంభమేళా కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. దీని భాగంగా మారడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Details

 త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు 

దక్షిణాఫ్రికా హైకమిషనర్ అనిల్ సూక్లాల్ మాట్లాడుతూ, కుంభమేళాలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారిందని తెలిపారు. కుంభమేళాలో కేవలం హిందువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు పాల్గొనడం భారత సంస్కృతి మహత్తును తెలియజేస్తుందని అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల భారీ ప్రవాహం కారణంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు యోగి సర్కార్ అప్రమత్తమైంది.

Details

కుంభమేళా ప్రాంతం నో-వెహికల్ జోన్ గా ప్రకటింపు

రద్దీ నియంత్రణ కోసం పలు చర్యలు తీసుకుంది. కుంభమేళా ప్రాంతాన్ని నో-వెహికల్ జోన్‌గా ప్రకటించింది. వాహనాల ప్రవేశంపై ఎటువంటి మినహాయింపులు లేకుండా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, వీవీఐపీ మరియు స్పెషల్ పాస్‌లను కూడా రద్దు చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలో ఫోర్ వీలర్ వాహనాల ప్రవేశంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది.